ఉద్యమాలకు భయపడే...: వేణు మాధవ్
హైదరాబాద్ :ఉద్యమాలతో నిర్మాతలు భయపడి సినిమాలను గతంలో మాదిరిగా తీసేందుకు ముందుకు రావడం లేదన్నారు. గతంలో తాను సంవత్సరానికి 50 సినిమాల్లో నటించేవాడినని, కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యమాల వలన సినీ పరిశ్రమలోని అందరికీ అవకాశాలు తగ్గిపోయాయని, ఇబ్బంది ఏర్పడిందని వేణుమాధవ్ చెప్పారు. నల్లగొండ జిల్లా కోదాడలో గురువారం జరిగిన జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు పార సీతయ్య కుమారుడి వివాహానికి హాజరైన ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మీడియాతో మాట్లాడారు.
అలాగే సినీ పరిశ్రమలో తెలంగాణ, ఆంధ్ర వివక్ష లేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాను.. ఆంధ్ర నిర్మాతలు తీసిన సినిమాల్లోనే ఎక్కువగా నటించానన్నారు. సినిమా పరిశ్రమ తనకు పూర్తి సంతృప్తిని ఇచ్చిందన్నారు. ప్రపంచ సినీ పరిశ్రమలో ఎక్కువ మంది కమెడియన్లు తెలుగు పరిమ్రలోనే ఉన్నారని, ఇంకెంతమంది వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారన్నారు.
సినిమాల్లో శృతిమించిన హస్యాన్ని తాను వ్యతిరేకిస్తానని, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తాను నటించకుండా వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. మహిళలను అవమానపర్చకుండా, సకుటుంబంగా కూర్చుని చూసే సినిమాల్లోనే తాను నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అవకాశమొస్తే హీరోగా మరల నటిస్తానని ప్రకటించారు.
శ్రీహరి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని, ఆ బాధతో దసరా పండగను చేసుకోలేదని ఆవేదనతో చెప్పారు. ప్రజలు కోరుకొంటే ప్రజాభీష్టాన్ని గౌరవించి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పార సీతయ్య, వేముల వెంకటేశ్వర్లు, మీరా, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. తనను పెంచి పోషించిన కోదాడ ప్రజల రుణాన్ని తీర్చుకొనేందుకు కోదాడలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.


Click it and Unblock the Notifications












