దర్శక శిఖరం కె. బాలచందర్ మృతి
చెన్నై: ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ మృతి చెందారు. ఒక్కసారిగా భారతీయ చిత్ర పరిశ్రమ కలవరపాటుకు గురైంది. జ్వరంతో బాధపడుతున్న బాలచందర్ను మైలాపూర్లోని కావేరీ ఆసుపత్రిలో ఇటీవల చేర్చారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించిందని సోమవారం సాయంత్రం వదంతులు వ్యాపించాయి. మీడియా ప్రతినిధులు పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే అంతాబాగానే ఉందని అన్నారు. ఈలోగా...ఆయన మరణ వార్త ఆయన అభిమానులను బాధపెట్టాలా బయిటకు వచ్చింది. ఆయన వయస్సు 84.
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని నన్నిలం గ్రామం ఆయన స్వస్థలం. వస్త్రాలపై వేసే రంగురంగుల పెయింటింగులకు ఈ గ్రామం ప్రసిద్ధి. వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం. నాన్న దండపాణి కైలాసం. అమ్మ సరస్వతి. అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి బీయస్సీ పూర్తి చేశాడు. తరువాత అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉద్యోగిగా ఆయన జీవితం ప్రారంభమైంది. ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో సరదాగా నాటకాలు రాస్తుండేవాడు. అలా రాసిన ఒక నాటకం ఎం.జి. రామచంద్రన్ దృష్టిలో పడటంతో ఆయన్నుంచి ఆహ్వానం వచ్చింది. ఎంజీఆర్ నటించిన దైవతాయి అనే చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ప్లే అందించాడు.

45 ఏళ్లలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించాడు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశాడు. ఆయన సినిమా పరిశ్రమలో అడుగు పెట్టేసరికి సినిమాలన్నీ హీరోయిజంతో నిండిన కథలే ఉండేవి. అంటే కథలన్నీ పురుష ప్రధానంగా సాగుతూ ఉండేవి. ఈ పంథాను మార్చడానికి, తన ప్రత్యేకతను నిరూపించుకోవడానికి ఆయన మధ్యతరగతి కుటుంబాలను, వారి ఆశలు, ఆశయాలను, ప్రేమను, అభిమానాలను కథా వస్తువులుగా ఎన్నుకొన్నాడు. ఆయన సినిమాలోని పాత్రలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి.
ఆయన మృతికి వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.


Click it and Unblock the Notifications











