రేపిస్టులను ఉరితీయొద్దన్న నేతపై విద్యాబాలన్ ఫైర్
ముంబై: సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ రేపిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. యువకులు తప్పు చేయడం సహజం, అంత మాత్రానికే వారికి మరణ శిక్ష విధించడం సరికాదు, చట్టాల్లో మార్పులు తెచ్చే ప్రయత్నం చేస్తాం అంటూ ములాయం సింగ్ వ్యాఖ్యానించారు.
ములాయం సింగ్ యాదవ్ వ్యాఖ్యలపై విద్యా బాలన్ తీవ్రంగా స్పందించారు. మహిళల మనోభావాల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ములాయంకు ఓటు వేసేది లేదని బాలన్ తేల్చిచెప్పారు. రేప్ సంఘటనలపై మరణ శిక్ష విధించడంపై అనేక భిన్న అభిప్రాయ భేదాలున్నప్పటికీ రేప్ మాత్రం క్షమించరాని నేరమని విద్యా బాలన్ పేర్కొన్నారు.

ములాయం సింగ్ వ్యాఖ్యలను దేశంలోని మహిళా సంఘాల నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. పలువురు బాలీవుడ్ తారలు ములాయం వ్యాఖ్యలపై మండి పడ్డారు. బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు విన్న తర్వాత మహిళగా, మనిషిగా ఎలా స్పందించాలో అర్థం కావడం లేదన్నారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ ఎన్నికల ప్రచార సభలో ములాయం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యాచార నిందితులకు ఉరి తీయడం సరికాదు, యువకులతో అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతాయి అని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన రెండు సామూహిక అత్యాచారం కేసుల్లో ముగ్గురు దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించిన సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.


Click it and Unblock the Notifications











