భానుమతిగారు, సావిత్రిగారిని ఆదర్శంగా తీసుకుని దర్శకురాలిగా మారి
''భానుమతిగారు, సావిత్రిగారు నటీమణులుగా నిరూపించుకోవడంతో పాటు మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారిని ఆదర్శంగా తీసుకుని దర్శకురాలిగా మారి తొలి ప్రయత్నంగా 'మీనా" సినిమా చేశాను. ఆ చిత్రం విజయం సాధించడంతో వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ఏ నటీనటులకైనా, సాంకేతిక నిపుణులకైనా మొదటి సినిమా హిట్ అయితే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతున్న అంజనా విజయం సాధించాలని, ఈ చిత్రం 100 రోజులాడి మొత్తం యూనిట్కి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను"" అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు. నాని, నిత్యామీనన్, బిందు మాధవి కాంబినేషన్లో అంజనా దర్శకత్వంలో మాస్టర్ అచ్యుత్ సమర్పణలో అశోక్ వల్లభనేని నిర్మించిన 'సెగ" ఆడియో ఆవిష్కరణలో పాల్గొన్న విజయనిర్మల పై విధంగా స్పందించారు. ప్రేమ, స్నేహం, పగ, ప్రతీకారం.. ఇలా అన్ని అంశాల సమాహారంతో రూపొందించిన చిత్రం ఇది. దర్శకురాలు అంజన ఈ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు. తమిళంలో పేరుపొందిన దర్శకుల వద్ద ఆమె శిష్యరికం చేశారు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళంలో దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మిస్తుంటే, తెలుగులో మనదేశం మూవీస్ పతాకంపై అశోక్ వల్లభనేని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











