నాగార్జునకు ఎసరుపెట్టిన రాములమ్మ.. భూముల స్వాధీనం ఎప్పుడు? డ్రగ్ కేసు ఏమైంది? కేసీఆర్పై విజయశాంతి
Recommended Video
లేడీ సూపర్స్టార్ విజయశాంతి రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ విజయశాంతి ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. అక్రమార్కులను తాట వలుస్తామని చెప్పిన ప్రభుత్వం మౌనం దాల్చడం వెనుక అసలు రహస్యం ఏమిటి అని ప్రశ్నించారు. హీరో నాగార్జున, డ్రగ్స్ కేసులో పట్టుబడిన సినీ ప్రముఖులను విజయశాంతి ఈ వివాదంలోకి లాగారు. ట్విట్టర్లో ఆమె ఏమన్నారంటే..

సినీ హీరో నాగార్జునపై ఘాటుగా
ఐదేళ్ల క్రితం ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు మరచిపోయి ఉండొచ్చు. అందుకే 2014 ఎన్నికల ప్రచారంలో హీరో నాగార్జునను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. ఆ కేసీఆర్ ప్రసంగం వీడియోను లింక్ను ఇక్కడ జతపరుస్తున్నాను అని విజయశాంతి ట్వీట్ చేశారు. రెవిన్యూ చట్ట ఉల్లంఘనలపై చర్యలు కేవలం బలహీన వర్గాల వారికే వర్తిస్తాయా...లేక హీరో నాగార్జున లాంటి పలుకుబడి ఉన్న సెలబ్రిటీలకు కూడా వర్తిస్తాయా అనే విషయంపై స్పష్టతరావాలి. లేనిపక్షంలో రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశం కూడా కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా మారుతుంది అని అన్నారు.

నాగార్జున అక్రమ భూములను
2014 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ హీరో నాగార్జున హైదరాబాద్ శివార్లలోని భూములను అక్రమంగా సొంతం చేసుకున్నారు. టీఆరెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను మళ్లీ స్వాధీనం చేసుకుంటాం కేసీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములపై ఎందుకు చర్య తీసుకోలేదు అని విజయశాంతి ప్రశ్నించారు.

నాగార్జునపై చర్య తీసుకోలేదేందుకు
సినీ హీరో నాగార్జున అక్రమంగా భూములను రెగులరైజ్ చేసుకున్నారన్న ఆరోపణలపై ఎందుకు చర్య తీసుకోలేదు. ఇప్పుడు రెవిన్యూ శాఖ ప్రక్షాళన సందర్భంగానైనా హీరో నాగార్జున అక్రమంగా కొన్న భూములపై చర్యలు ఉంటాయా అని తెలంగాణ ఉద్యమకారులునిలదీస్తున్నారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అనే విధంగా విజయశాంతి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

సినీ తారల డ్రగ్ కేసు
హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా కేసు అప్పట్లో సంచలనం రేపింది. డ్రగ్స్ కేసులో రోజుకో సెలబ్రిటీని పిలిచి, విచారణ పేరుతో పెద్ద హడావుడి చేశారు. చివరకు ఈ వ్యవహారంపై ఊసెత్తడంలేదు.
డ్రగ్స్ కేసును ఎందుకు నిర్వీర్యం చేశారనే కోణంలో విజయశాంతి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత ఉన్నట్టుంది కేసీఆర్, నాగార్జున, సినీ ప్రముఖులపై విజయశాంతి మండిపడటం చర్చనీయాంశమైంది.

ఎప్పుడు స్వాధీనం చేసుకొంటారని ప్రశ్న
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు గానీ.. ఆ ప్రభుత్వ భూములు నాగార్జున ఆధీనంలోనే ఉన్నాయి. మరి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని కేసీఆర్ను విజయశాంతి ప్రశ్నించింది. ట్విట్టర్ వ్యాఖ్యల వెనుక అంతర్యం ఏమిటనే విషయం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











