హీరో, హీరోయిన్స్ అంటూ ఎవరూ లేరు: విక్రమ్
హైదరాబాద్: ''ఏ సినిమాకైనా కథే కీలకం అని భావిస్తాను. ఇందులో హీరో,హీరోయిన్స్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అయితే ప్రేక్షకులకు కావాల్సిన పాటలు, ఫైట్లు... ఇలా అన్ని హంగులూ ఉంటాయి. స్త్టెలిష్గా సాగే ఒక థ్రిల్లర్ తరహా కథాంశమిది'' అన్నారు విక్రమ్. ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'శివతాండవం'. అనుష్క నాయిక. జగపతి బాబు, అమీజాక్సన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఎ.ఎల్.విజయ్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. జి.వి.ప్రకాష్కుమార్ స్వరాలు సమకూర్చారు. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత్రంలోని పాటలు విడుదలయ్యాయి. తొలి సీడీని వి.వి.వినాయక్ ఆవిష్కరించారు. చిత్ర దర్శకుడు విజయ్ తండ్రి అలగప్పన్, వి.బి.రాజేంద్రప్రసాద్, కె.ఎస్.రామారావులు స్వీకరించారు.
అలాగే... విక్రమ్ మాట్లాడుతూ ''ఇందులో నా పాత్రనీ, జగపతి బాబు పాత్రనీ బేరీజు వేసి చూసుకొన్నప్పుడు నాకు జగపతి పాత్రే బాగా నచ్చింది. ఆయనతో కలిసి నటించడం గర్వంగా భావిస్తున్నాను. నా కెరీర్లో ఓ మంచి చిత్రమిది. హాలీవుడ్ స్థాయిలో తీర్చిదిద్దారు విజయ్. జీవీ ప్రకాష్ మంచి సంగీతం అందించాడు. జగపతి బాబుతో పని చేయడం ఓ అద్భుతమైన అనుభవం. ఆయన కొన్ని సన్నివేశాల్లో తిరుపతి లడ్డంత అందంగా కనిపిస్తారు. ఆయన అందం చూసి నాకే జెలసీగా అనిపించింది. ఈ సినిమాలో మేమిద్దరం హీరోలు కాదు. కథే హీరో. దర్శకుడు సూపర్ హీరో''అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ ''చాలా రోజుల తర్వాత ఒక మంచి బృందంతో పనిచేశాను. సాధారణంగా నేను పనిచేసిన దర్శకులంతా నా నుంచి ఎక్కువగా సలహాలు తీసుకొనేవారు. కానీ విజయ్ మాత్రం ఎలాంటి సలహాలు, సూచనలు అడగకుండా ఈ సినిమాని తీశారు. అభిమానులు సినిమాని సినిమాలాగే చూడాలి. ఎవరి పాత్ర ఎక్కువ, ఎవరిది తక్కువ అని బేరీజు వేసుకోవద్దు. ఈ సినిమాలో పాత్ర నచ్చి నాకు నేనుగా నటించాను. నా అభిమానులకు ఈ చిత్రం ఆనంద తాండవం అవుతుంది. నేను పుట్టి పెరిగిన చెన్నైలో చాలా రోజుల తర్వాత షూటింగ్ చేయడం ఆనందంగా అనిపించింది''అన్నారు.
సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ''విజయ్తో ఇది నాకు నాలుగో చిత్రం. గొప్ప అనుభవాన్ని ఈ చిత్రంతో సొంతం చేసుకొన్నా'' అన్నారు. నిర్మాత చిత్రం గురించి చెబుతూ ''విక్రమ్, జగపతి బాబులతో సినిమాలు నిర్మించాలని ఎప్పట్నుంచో అనుకొంటున్నాను. ఆ రెండు కోరికలు ఈ సినిమాతో నెరవేరాయి''అన్నారు. ''యాక్షన్, వినోదం... ఈ రెండింటి మేళవింపుతో ఉంటుందీ చిత్రం. ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాము''అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో అమీ జాక్సన్, బి.గోపాల్, కె.ఎల్.నారాయణ, దొరస్వామిరాజు, అర్జున్రాజు, కె.సి.శేఖర్బాబు, రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











