స్టేజిపై రజనీ,రాజమౌళి అదరకొట్టారు(ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకే స్టేజిపై కనపడటంతో పండగ వాతావరణం క్రియేట్ అయ్యింది. ఇంతకీ ఈ వేడుక ఎప్పుడు జరిగిందంటారా...నిన్న(శనివారం)రాత్రి విక్రమ్ సింహా ఆడియో పంక్షన్ లో ఈ ఉద్వేగపూరిత సంఘటన చోటు చేసుకుంది.
రజనీకాంత్ నటించిన చిత్రం 'కోచ్చడయాన్'. తెలుగులో 'విక్రమసింహ'గా వస్తోంది. సౌందర్య దర్శకురాలు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. 'విక్రమసింహ' పాటల్ని, ప్రచార చిత్రాల్ని శనివారం రాత్రి హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాసరి విచ్చేసారు. అలాగే రామానాయుడు, మోహన్ బాబు కూడా పాల్గొని పంక్షన్ కి నిండుతనం తెచ్చారు.
''పుట్టిన ప్రతి ఒక్కరూ చరిత్ర సృష్టించలేరు. తాను లేకపోయినా.. ప్రజల హృదయాల్లో వందేళ్లు బతికేవాడే చరిత్రకారుడు. రజనీకాంత్ అలాంటివాడే'' అన్నారు ప్రముఖ దర్శకుడుదాసరి నారాయణరావు.
హైలెట్స్ ఫోటోలతో స్లైష్ షోలో...

సీడీ ఆవిష్కరణ
హైదరాబాద్లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో డా. దాసరి సీడీని ఆవిష్కరించారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ....
''వందేళ్ల సినీ చరిత్రలో కొడుకును డైరెక్ట్ చేసిన తండ్రులున్నారు. కానీ తండ్రి సినిమాకి దర్శకత్వం వహించిన ఘనత సౌందర్యకే దక్కుతుంది. హాలీవుడ్తో పోల్చుకొంటే మన సినిమా వెనుకబడిపోతోందేమో అనుకొంటున్న దశలో 'విక్రమసింహ' వస్తోంది. 40 ఏళ్ల నుంచీ రజనీకాంత్ని చూస్తున్నా. మనిషి ఏమాత్రం మారలేదు. ఆనాడు ఒక్క మద్రాస్ నగరానికి మాత్రమే పరిమితమైన రజనీ ఇమేజ్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తమైంది.'' అన్నారు.

దాసరి కంటిన్యూ చేస్తూ...
రజనీ సౌమ్యుడు. తనకు లేని దాని గురించి ఆలోచించడు. మనకు కావల్సింది హీరోలు కాదు, స్టార్లు కాదు.. మానవత్వం ఉన్న మనుషులు. అలాంటి మనిషి రజనీకాంత్. 'బాబా' చూశా. 'బాషా'కన్నా గొప్ప సినిమా అది. కానీ ఆడలేదు. ఆ సినిమా వల్ల డబ్బులు పోగొట్టుకొన్న పంపిణీదారుల్ని ఇంటికి పిలిచి డబ్బులిచ్చిన ఇలాంటి వ్యక్తిని ఎవరూ చూసుండరు. రజనీకాంత్ రిటైర్ అయిపోతాడేమో అనుకొన్న ప్రతిసారి ఐదేళ్లపాటు తన కెరీర్ని పొడిగించుకొంటూ వస్తున్నాడు. ఇప్పుడొస్తున్న తారలంతా రజనీని ఆదర్శంగా తీసుకొవాలి అని చెప్పుకొచ్చారు.

డి.రామానాయుడు మాట్లాడుతూ....
''ఈ సినిమాకోసం పెట్టిన ఖర్చుకు రెండింతలు ఆదాయం రావాలి''అని ఆకాంక్షించారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ...
''సంభాషణలు పలికే విషయంలో రజనీకాంత్కి ఉన్న పట్టు అసాధారణం. ఈ చిత్రం ప్రపంచరికార్డుల్ని తిరగరాయాలి''అన్నారు

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ...
''అవతార్ సినిమా ఐమాక్స్లో ఏడాది ఆడింది. రూ.ఏడుకోట్లు సాధించింది. అది ప్రపంచ రికార్డ్. దాన్ని 'విక్రమసింహ' అధిగమించాలి''అన్నారు.

రాజమౌళి మాట్లాడుతూ...
''పెర్ఫార్మెన్స్ మోషన్ క్యాప్చర్ పద్ధతిలో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాతో పోల్చుకొంటే 'ఈగ'కి మేం పడిన కష్టం వందో వంతు ఉంటుందేమో..? కనీసం నాలుగైదేళ్లు పట్టే సినిమా ఇది. కానీ రెండేళ్లలో పూర్తిచేశారు. 'విక్రమసింహ'లోని ఓ పాటలో 'విజయం ఎప్పుడూ చెమటకు చుట్టం' అనే వాక్యం బాగా నచ్చింది. ఈ సినిమాకోసం చెమటోడ్చిన ఈ టీమ్కి విజయం తప్పకుండా అందుతుంది''అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ...
''నా మిత్రుడు రజనీకాంత్ అద్భుతాలు చేసే కూతుర్ని కన్నాడు. ప్రపంచం గర్వించదిగిన సినిమా తీసిందామె. తన ధైర్యానికి జోహార్లు. రజనీకాంత్ చేసిన శివతాండవం చూస్తుంటే రోమాలు నిక్కబొడిచాయి. రజనీ గురించి ఏం చెప్పను? మాది నలభై ఏళ్ల ప్రయాణం. రజనీ ఇద్దరు కూతుర్లు నా కోడళ్లు అవ్వాల్సింది. కానీ అన్నీ మా చేతుల్లో ఉండవు కదా..? ఈ సినిమాతో సౌందర్య ఆస్కార్ అవార్డు అందుకోవాలని ఉంది''అన్నారు

దర్శకురాలు సౌందర్య మాట్లాడుతూ...
''నాన్నకు పెద్ద అభిమానిని నేను. నేను కలలుగన్న నా హీరోని ఇలా తెరపై చూపించే అవకాశం దక్కింది. కాస్ట్యూమ్స్, సెట్స్.. ఇలా ప్రతి విషయంలోనూ చాలా శ్రద్ధ తీసుకొన్నాం. అవతార్ సినిమా ఓ ఫాంటసీ. వూహకు అందని పాత్రల్ని సృష్టించారు. కానీ 'విక్రమసింహ' అలా కాదు. నిజ జీవిత పాత్రల్ని తెరపై చూపించాలి. అది పెద్ద సవాల్. నా బృందమంతా బాగా సహకరించింది. మా కష్టానికి ప్రతిఫలం కోసం ఎదురుచూస్తున్నాం. మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరు భాషల్లో విడుదల చేస్తున్నాం'' అన్నారు.

రజనీకాంత్ మాట్లాడుతూ....
''రోబో, 'విక్రమసింహ' రెండూ టెక్నాలజీతో ముడిపడిన చిత్రాలు. అంతకు ముందు 'శివాజీ'లో నటించా. అది రాజకీయాల నేపథ్యంలో సాగే కథ. 'బాబా' దేవుడికి సంబంధించింది. 'చంద్రముఖి' దెయ్యం కథ. అదేంటో.. దేవుడి కథతో సినిమా తీస్తే.. డబ్బులు రాలేదు. దెయ్యం కథ మాత్రం లాభాలు తీసుకొచ్చింది. కమల్హాసన్ గొప్ప నటుడు. అతనికి ఇలాంటి సాంకేతిక విషయాలంటే ఆసక్తి. ఇలాంటి కథలు తను చేయాలి. కానీ అలాంటి అవకాశాలు నాకొస్తున్నాయి. '' అన్నారు.

రజనీకాంత్ కంటిన్యూ చేస్తూ...
మనం ఒకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుందంటే ఇదే. 'రాణా' సినిమా తీద్దామనుకొన్నాం. కానీ రెండేళ్లపాటు ఆరోగ్యం బాలేదు. అందుకే ఆ ప్రాజెక్టు పక్కన పెట్టాం. అలాంటి సమయంలో 'విక్రమసింహ' గురించి చెప్పారు. 'నో' చెప్పడానికి కారణాలు దొరకలేదు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్టుని సౌందర్య ఎలా చేపడుతుందో అర్థం కాలేదు. నిజానికి పదేళ్ల సమయం, దాదాపు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ కావాలి ఇలాంటి సినిమాలకు. కానీ మన పరిధిలో తీశారు. నేనీ సినిమా చూశా. తొలి పది నిమిషాలూ 'ఇదేంటి? ఇలా ఉంది?' అనే సందేహం కలిగింది. కానీ.. తరవాత ఇదొక యానిమేషన్ అనే సంగతే మర్చిపోయి కథలో లీనమైపోయా

సన్మానం
దాసరి నారాయణరావు, రామానాయుడు, మోహన్బాబు చేతుల మీదగా ఈ వేదికపై రజనీకాంత్ సతీమణి లతకు సన్మానం జరిగింది.

ఎవరెవరు
ఈ వేడుకలో టి. సుబ్బిరామిరెడ్డి, రమేష్ప్రసాద్, రాజమౌళి, శ్రీరామకష్ణ, ఆది, మురళి, లక్ష్మీప్రసన్న, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

అప్పటి కథ..
పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.

దీపికా హీరోయిన్ గా...
దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

పబ్లిసిటీ విభిన్నం
మరో ప్రక్క ఈ చిత్రం ప్రచారంలో వినూత్నంగా ముందుకుసాగుతోంది. ఈ సినిమాను తమిళం, తెలుగు, హిందీ, పంజాబీ, బోజ్పురి, మరాఠీ భాషలలో విడుదల చేయనున్నారు. మరో వైపు ఈ చిత్ర ప్రచారానికి గాను 3650 హోర్డింగులు, బ్యానర్లను తమిళనాడుతోపాటు కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ల్లోని భారత్ పెట్రోలియం బంకుల వద్ద ఏర్పాటు చేయనున్నారు. చెన్నైలో మాత్రమే వంద హోర్డింగులు అమర్చుతున్నారు.


Click it and Unblock the Notifications











