తెరవెనక రాజకీయాలకు కమల్ హాసన్ బలయ్యాడు
చెన్నై : 'విశ్వరూపం' చిత్రం వివాదానికి రాజకీయాలే కారణమని ఆ చిత్ర సహ రచయిత అతుల్ తివారీ ఆరోపించారు. కమల్ హాసన్తో కలిసి 'విశ్వరూపం' చిత్రానికి సహరచయితగా పని చేసిన 58 ఏళ్ల అతుల్ తివారీ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు రాజకీయాల్లో కమల్ హాసన్ పావయ్యాడని ఆవేదన వ్యక్తం చేసారు.
విశ్వరూపం చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ పలు ముస్లిం సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జనవరి 25న విడుదల కావాల్సిన 'విశ్వరూపం' చిత్రంపై రెండు వారాల బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే....ముఖ్యమంత్రి జయలలిత కమల్ హాసన్పై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే విశ్వరూపం చిత్రాన్ని నిలిపి వేసిందనే ప్రచారం మీడియాలో జరిగింది. రాజకీయాల్లో పావును అయ్యాను, ఇలా అయితే దేశం విడిచిపోతాను అని కమల్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచి చేసింది.
మొత్తానికి ముస్లిం సంఘాలతో చర్చల అనంతరం కొన్ని సీన్లకు కత్తెర వేసిన అనంతరం విశ్వరూపం చిత్రం ఈ రోజు తమిళనాడులో విడుదలకు సిద్ధమైంది. అయితే తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో విశ్వరూపం చిత్రం ముందుగానే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశంలోని అన్ని సినీరంగాలకు చెందిన ప్రముఖులు కమల్ హాసన్ కు మద్దతుగా నిలిచి ఐక్యతను చాటారు.
త్వరలో కమల్ హాసన్ విశ్వరూపం చిత్రానికి స్వీకెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దానికి 'మూ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. విశ్వరూపం చిత్రం షూటింగ్ సమయంలోనే విశ్వరూపం-2కు సంబంధించిన సీన్లను కూడా చాలా వరకు కంప్లీట్ చేసారని, మరికొంత భాగం షూటింగ్ పూర్తి చేసే సీక్వెల్ పూర్తవుతుందని టాక్.


Click it and Unblock the Notifications











