పరిటాల రవిగా ఆ హీరోనే

వర్మ మాట్లాడుతూ పరిటాల రవి జీవితానికి సంబంధించిన చాలా సమాచారం సేకరించాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాను. ప్రభాకరన్, దావూద్ ఇబ్రహీమ్ లాంటి వాళ్ల జీవితాల్ని గతంలో పరిశీలించాను. కానీ వారందరితో పోలిస్తే భిన్నమైన చరిత్ర పరిటాల రవిది. ఆయన్ను రక్తసిక్తమైన ఫ్యాక్షన్ వైపు నడిపించిన పరిస్థితులు...ఆ పరిస్థితులే ఆయన్ను తుదముట్టించేందుకు ఎలా తోడ్పడ్డాయి అనే కోణంలో రెండు భాగాలుగా ఈ కథలు సాగుతాయి. ఇంతవరకూ ఏ రచయితకూ దొరకని అరుదైన కథ ఇది.
నా కెరీర్లో ఓ మైలురాయిగా మిగులుతుంది. నేనేదో అద్భుతంగా ఈ చిత్రాల్ని తెరకెక్కిస్తానని ఈ మాట చెప్పట్లేదు. ఆయన జీవితం అలాంటిది. దమ్మున్న కథ దొరికిందన్న విషయాన్ని ఈ రకంగా చెబుతున్నాను. చిన్నతనంలో నెమ్మదస్తుడిగా, సిగ్గరిగా ఉన్న పరిటాల రవి తన సోదరుడు, తండ్రి మరణానంతరం ఫ్యాక్షన్ వైపు మరలిన తీరు, ఆ తరవాత జరిగిన సంఘటనలన్నీ వెండితెరపై ఆవిష్కరిస్తానని చెప్పారు.
ఇక ఈ సినిమా రీసెర్చి కోసం ఆయన ఫ్యాక్షన్ గ్రామాలను పరిశీలించటం, ఆ వ్యక్తులను కలవటం చేసారు. ఆ క్రమంలో మద్దెల చెర్వు సూరిని అనంతపురం జైలు కెళ్ళి కలిసారు. అనంతరం మద్దలచెరువు గ్రామానికెళ్లి సూరి కుటుంబ సభ్యులను కలుసుకుని వారి కుటుంబీకుల సమాధులను సందర్శించారు. వారింట భోజనం చేసి తన కథకు కావాల్సిన మరిన్ని విషయాల్ని వారి నుంచి సేకరించారు.మద్దలచెరువు గ్రామ ప్రజలతోనూ వర్మ ముచ్చటించారు.
వెంకటాపురం వెళ్ళి పరిటాల సునీతని,వారి బంధు వర్గాన్ని కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ మద్దెల చెర్వు సూర్యానారాయణ రెడ్డితో పాటు పరిటాల రవి సతీమణి, శాసనసభ్యురాలు పరిటాల సునీత సినిమా తీయడానికి అంగీకరించినట్లు ఆయన తెలిపారు. అలాగే..తన సినిమా ఎవరినీ బలపరిచేదిగా ఉండదని, సందేశాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పారు.
తన రక్తచరిత్ర సినిమాకు మద్దెలచెర్వు సూరి పెట్టుబడి పెడుతున్నారనే వార్తలను ఆయన ఖండించారు. సినిమా మొత్తం రాయలసీమ జిల్లాల్లోనే షూటింగ్ జరుపుకుంటుందని ఆయన చెప్పారు. అయిదు గంటల నిడివితో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని వర్మ ప్రకటించారు. మొదటి భాగం వచ్చే జనవరిలోనూ, రెండో భాగం ఏప్రిల్లోనూ విడుదల చేస్తారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో 'రక్త చరిత్ర' పేరుతో విడుదల చేసే అంశమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిటాల రవి జీవితంతో తీసే సినిమా కాబట్టి కచ్చితంగా తెలుగులో కూడా తీసుకొచ్చే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications











