మంచు విష్ణు ఆరోపణలు అవాస్తవం.. 1.50 కోట్లు చెల్లించేలా.. బలవంతంగా సంతకాలు!
హీరో మంచు విష్ణు బృందం, దర్శకుడు కార్తీక్ రెడ్డి, నిర్మాత సుధీర్ పూదోట మధ్య పరస్పర ఆరోపణలతో ఓటర్ మూవీ వివాదం సినిమాను మించిన ట్విస్టులతో సాగుతున్నది. దర్శక, నిర్మాతలపై విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ క్రమంలో సినిమా వివాదంపై నిర్మాత సుధీర్ పూదోట స్పందించారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఈ వివాదంలో తనను ఇరికించారని ఆయన స్పష్టం చేశారు. నిర్మాత సుధీర్ తన ప్రకటనలో ఏం చెప్పారంటే..

అసెంబ్లీ రౌడీ మూవీ గురించి చర్చే లేదు
ఓటర్ సినిమా ప్రారంభించే ముందు కథపై కొన్ని సందేహాలు వచ్చాయి. దాంతో మంచు విష్ణు, చిత్ర నిర్మాత పూదోట జాన్ సుధీర్ కుమార్, దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి కథపై కసరత్తు చేశారని, అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లే మాదిరిగా ఉంటే బాగుంటుందని చెబుతున్న మాటలు పూర్తిగా అవాస్తవాలు. అసెంబ్లీ రౌడీ స్క్రీన్ ప్లేకి సంబంధించి మా మధ్య ఎలాంటి మీటింగులు, చర్చలు జరుగలేదు అని నిర్మాత సుధీర్ కుమార్ పూదోట స్పష్టం చేశారు.

బలవంతంగా పాత అగ్రిమెంట్పై సంతకాలు
2019 మార్చి 27నలో దర్శకుడు కార్తీక్ రెడ్డి, మంచు విష్ణు మా ఆఫీస్లో కలిశాం. ఆ తర్వాత విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు వారి ఇంటికి అల్ఫహార విందుకు వెళ్లాం. పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారం.. రెడీగా ఉన్న అగ్రిమెంట్పై సంతకం చేయించారు. అగ్రిమెంట్ 2017 మార్చి 23 తేదీ ఉండటంతో మాకు పలు సందేహాలు కలిగాయి అన్నారు.

రూ.1.5 కోట్లు చెల్లించేలా
అసెంబ్లీ రౌడీ కథ, సీన్లు, స్క్రీన్ ప్లేను వాడుకొన్నందుకు రూ.1.50 కోట్లు చెల్లించేలా మాతో బలవంతంగా సంతకాలు చేయించారు. ఆ తర్వాత తప్పుడు అగ్రిమెంట్ వద్దని, మంచు విష్ణు బృందం నుంచి నన్ను కాపాడాలని దర్శకుడు నాతో మొరపెట్టుకొన్నాడు అని నిర్మాత సుధీర్ తెలిపారు.

ఆ ఒప్పందంతో నాకు సంబంధం లేదు
అసెంబ్లీ రౌడీ కథ, స్క్రీన్ ప్లే, సీన్ల గురించి నాకు, దర్శకుడు జీ కార్తీక్ రెడ్డి, ఇతరుల మధ్య ఎలాంటి చర్చలు జరుగలేదు. వారి మధ్య జరిగిన ఒప్పందంతో సంబంధం లేదు. దర్శకుడు కార్తీక్ రెడ్డి, విష్ణు స్నేహితుడు విజయ్ కుమార్ రెడ్డి జరిగిన రహస్య అగ్రిమెంట్కు సంబంధించిన నన్ను డబ్బు కట్టమనడం ఎంత వరకు కరెక్ట్ అని నిర్మాత జాన్ సుధీర్ ప్రశ్నించాడు.

వివాదం వెనుక అసలు కారణమిదే అని
ఓటర్ సినిమా వివాదం వెనుక అసలు కారణం వేరే ఉంది. తాము నిర్మించిన సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకమే ఈ గొడవలకు కారణం అని నిర్మాత సుధీర్ కుమార్ వెల్లడించారు. ఓటర్ చిత్రంలో మంచు విష్ణు, సురభి, సుప్రీత్, పోసాని, బ్రహ్మాజీ తదితరులు నటించారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది. వివాదం కారణంగా వాయిదా పడినట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











