'నేను వ్యతిరేకిని' తేల్చి చెప్పిన వివి వినాయిక్
హైదరాబాద్: కమల్ హాసన్ తాజా చిత్రం విశ్వరూపం ప్రస్తుతం బిజినెస్ వర్గాల్లో, సిని వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని రిలీజ్ కు ముందురోజే డీటీహెచ్లో విడుదల చేయాలనుకోవటమే దీనికి కారణం. ఈ నేపధ్యంలో ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ ఈ డిటిహెచ్ విధానంపై స్పందించారు. తాను ఈ విధానానికి పూర్తి వ్యతిరేకిని అని తేల్చి చెప్పారు.
వినాయిక్ మాట్లాడుతూ.... ''డీటీహెచ్లో సినిమా విడుదల చేయడం వల్ల నిర్మాతలకు ఎంత లాభమో నాకు తెలీదు. కానీ పంపిణీదారుడు పూర్తిగా నష్టపోతాడు. ఆ ప్రభావం పక్క సినిమాలపైనా పడుతుంది. అయినా పెద్ద తెరపై చూస్తే కలిగే అనుభూతి.. ఇంట్లో బుల్లి తెరపై చూస్తున్నప్పుడు రాదు. జనం మధ్య కూర్చుని చూస్తే మంచి సినిమా.. ఇంకా మంచి సినిమాలా కనిపిస్తుంది. అదే టీవీలో అయితే ఓ మాదిరి సినిమా కూడా చెత్త సినిమాలా అనిపిస్తుంది. అందుకే ఈ విధానానికి నేను వ్యతిరేకిని'' అన్నారు.
ఎన్ని వాణిజ్య హంగులు మేళవించినా.. అంతర్లీనంగా ఓ బలమైన సామాజిక అంశం జోడించడం మాత్రం వినాయిక్ మర్చిపోరు. 'సాంబ'లో విద్యావ్యవస్థ తీరు తెన్నులు చూపించారు. అవినీతిపై 'ఠాగూర్' అనే బ్రహ్మాస్త్రాన్ని వదిలారు. వినోదం మేళవించడంలోనూ దిట్టే. 'కృష్ణ', 'అదుర్స్' సినిమాలే అందుకు సాక్ష్యం. మరోసారి మాస్, క్లాస్.. ఇద్దరినీ మెప్పించే కథతో వస్తున్నా.. అంటున్నారు. ఆ చిత్రమే 'నాయక్'. ''మనిషికి మరో మనిషి సాయం చేసుకోవాలనే మాట ఈ సినిమాలో చెబుతున్నాం. అలాగని ఇదేదో సందేశాత్మక చిత్రం అనుకోవద్దు. పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది''అంటున్నారు.
'నాయక్' ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయమై మాట్లాడుతూ... సంక్రాంతికి సినిమా తీసుకొచ్చే సెంటిమెంట్ కాదు కానీ... పండక్కి కొత్త సినిమా వస్తే బాగుంటుంది కదా? 'కృష్ణ', 'అదుర్స్', 'లక్ష్మి' ఈ సినిమాలు సంక్రాంతికే వచ్చాయి. మంచి ఫలితాలు సాధించాయి. 'నాయక్' కూడా పండగ సందడిని రెట్టింపు చేస్తాడనే నమ్మకం ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











