పిలిస్తే నిముషంలో వాలిపోతా: ప్రియమణి
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కబురు చేసిన మరు నిమిషం ఆయన ముందు వాలిపోతానని నటి ప్రియమణి అన్నారు. షారుఖ్ పుట్టినరోజు సందర్భంగా ప్రియమణి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
దీనికి స్పందించిన షారుఖ్ ప్రియమణికి ధన్యవాదాలు తెలుపుతూ... మళ్లీ మనం కలిసి నృత్యం చేయాలని సరదాగా ట్వీట్ చేశారు. ఇందుకు ప్రియమణి సమాధానమిస్తూ షారుఖ్ కబురు చేసిన మరు నిమిషం ఆయన ముందు వాలిపోతానంటూ సమాధానం ఇచ్చారు.
'చెన్నై ఎక్స్ప్రెస్' చిత్రంలో షారుఖ్ ఖాన్తో కలిసి ప్రియమణి ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడిన సంగతి తెలిసిందే.

ప్రియమణి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే...
హీరోయిన్ ప్రియమణి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఓనర్ ముస్తఫా రాజ్తో గత కొంత కాలంగా ప్రేమాయణం నడుపుతున్న ప్రియమణి ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు కొన్ని నెలల క్రితమే బహిర్గతం చేసింది.
వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని తొలుత నిర్ణయించుకున్నప్పటికీ.... తాజాగా నిర్ణయం మార్చుకున్నారు. ప్రియమణి జాతకం ప్రకారం పెళ్లి తేదీ విషయంలో మార్పులు చేయాల్సి వచ్చింది. దీంతో మరికొంత కాలం వెయిట్ చేయాలని భావిస్తున్నారు. ఇరు కుటుంబాల వారు జాతకాలను బాగా నమ్మే వారు కావడంతో వాయిదా విషయంలో అందరూ ఒకే మాటపై ఉన్నారు.
అయితే ప్రియమణి సన్నిహితులు చెబుతున్న వివరాల ప్రకారం.... ఇద్దరి వివాహం వాయిదా పడిన మాట వాస్తవమే కానీ, మరీ ఎక్కువ ఆలస్యం ఏమీ కాదని, త్వరలోనే వారి వివాహం జరుగుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











