దాసరి రాస్తానన్న ఆపుస్తకం ఏమైంది?? అప్పట్లో చాలా మందిని వణికించిన దాసరి ప్రకటన
దాసరి నారాయణ రావు ఇక లేరు. కానీ ఆయన బయటపెడతానన్న వాస్తవేలేంటని సర్వత్రా చర్చ జరుగుతోంది
దాసరి నారాయణ రావు అనారోగ్య కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దాసరి నారాయణ రావు ఇక లేరు. కానీ ఆయన బయటపెడతానన్న వాస్తవేలేంటని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆయన గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తాను మూడునాలుగు సంవత్సరాల నుంచి ఓ పుస్తకం రాస్తున్నానని దాసరి వెల్లడించారు. ఇంకా ఏడాదిన్నర పడుతుందని, అందులో చాలా వాస్తవాలుంటాయని ఆయన తెలిపారు.

ఆయన రాసిన పుస్తకంపై
ఆ పుస్తకంలో సినీ పరిశ్రమలో గొప్పగొప్ప వాళ్లుగా చెప్పుకుంటున్న వారి అసలు చరిత్రలుంటాయని దాసరి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అప్పట్లో ఈ వ్యాఖ్యలపై పెను దుమారమే రేగింది. దాసరి అకాల మరణంతో ఆయన వెల్లడించాలనుకున్న వాస్తవాలు కాలగర్భంలో కలిసిపోయాయి. దీంతో మరోసారి ఆయన రాసిన పుస్తకంపై చర్చ సాగుతోంది. ఆయన ఎవరి గురించి ఆ పుస్తకంలో రాశారనే దానిపై ఇండస్ట్రీతో పాటు సినీ జనాల్లో కూడా చర్చ జరుగుతోంది.

బయోగ్రఫీ రాస్తున్నాను
అందుకే ఆ మధ్య ఆయనే ప్రకటించారు బయోగ్రఫీ రాస్తున్నాను అని. మూడున్నరేళ్ల నుంచి రాస్తున్నా.. మరో ఏడాదిన్నరలో పూర్తవుతుందని చెప్పారు. కానీ ఆలోపే ఆయన కన్నుమూశారు.అయితే.. ఆయన కేవలం తన చరిత్ర మాత్రమే రాస్తానంటే ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ రోజు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలా మంది బండారం
పెద్దలుగా చలామణి అవుతున్న చాలా మంది బండారం బయటపెడతానని బహిరంగ వేదికపైనే చెప్పారు. చాలా అబద్దాలు ప్రస్తుతం నిజాలుగా చలామణి అవుతున్నాయి. వాటన్నింటి గురించి తన బయోగ్రఫీలో చెబుతానని అనౌన్స్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

వెండితెర అరుణ కిరణం టి.కృష్ణ
కొంత కాలం కిందట పసుపులేటి రామారావు రచించిన 'వెండితెర అరుణ కిరణం టి.కృష్ణ' పుస్తక పుస్తకం ఆవిష్కరణ సభలో దాసరి ఆ వ్యాఖ్యలు చేశారు. తన బయోగ్రపీ బయటకు వస్తే.. చాలా మంది అసలు గుట్లు బయటపడతాయని దాసరి అన్నారు. ఎన్టీఆర్ ను పరిచయం చేసింది ఎవరు? అంటే ఎల్వీ ప్రసాద్ అంటారని, అలాంటి అబద్ధాలే ఇండస్ట్రీలో ప్రచారానికి నోచుకుంటున్నాయని.. అనేక మంది విషయంలో అలాంటి అబద్ధాలే ప్రచారంలో ఉన్నాయని దాసరి అప్పుడు వ్యాఖ్యానించారు.

వాస్తవాలు తెలియాలని
కొన్నాళ్లుపోతే ఇండస్ట్రీ ఎక్కడ మొదలైందంటే హైదరాబాద్ లో అంటారని, ఫలానా సినిమాతో ఇండస్ట్రీ గమనం మొదలైందని అంటారని.. అయితే ఆ పరిస్థితి ఉండకూడని, వాస్తవాలు తెలియాలని దాసరి అన్నారు. తన బయోగ్రఫీ సంచలనాలన్నింటి వాస్తవాలతో వస్తుందని వ్యాఖ్యానించారు.

సమాధానం లేని ప్రశ్నే
మరి తన బయోగ్రఫీ గురించి దాసరి అంత వాడీవేడీగా చెప్పడంతో.. అది మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దాసరి నారాయణరావు కన్నుమూయడంతో ఆయన బయోగ్రఫీ కూడా కాలగమనంలో కలిసిపోతుందా..? తెలుగు సినిమా చరిత్రలోని వాస్తవాలను ప్రపంచానికి తెలియజేస్తుందా...? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నే.


Click it and Unblock the Notifications











