'బంపర్ ఆఫర్' పూరీ కొట్టేశారు: ఓ రచయిత గగ్గోలు
పూరీ జగన్నాథ్ నిర్మించిన 'బంపర్ ఆఫర్' చిత్రం కథ తనదేననీ, తనకు తెలియకుండా తన కథతోనే సినిమా తీసి తీరని అన్యాయం చేశారనీ యువ రచయిత, దర్శకుడు ఆర్.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగేంత వరకూ పోరాటం జరుపుతానంటూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న సినీ రచయితల సంఘం ముందు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. అనంతరం సినీ పెద్దల హామీతో దీక్ష విరమించారు.
దీక్ష సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో తాను నవదీప్ హీరోగా 'పొగరుబోతు', సచిన్ తో 'నిను చూడక నేనుండలేను' చిత్రాలకు దర్శకత్వం వహించానని చెప్పారు. వీటి తర్వాత తాను రాసుకున్న కథను ఓ తమిళ నిర్మాతను కలిసి సినిమా తీసేందుకు ఒప్పించాననీ, చిత్ర నిర్మాణానికి సన్నాహాలు కూడా జరిగాయనీ చెప్పారు. ఈ కథను తాను హైదరాబాద్ లోని రచయితల సంఘంలో రిజిస్టర్ కూడా చేయించానని తెలిపారు. ఆ తర్వాత క్రమంలో 'బంపర్ ఆఫర్' విడుదలైందని అన్నారు. తాను తన కథ గురించి మిత్రులకు చెప్పినప్పుడు ఇదే కథతో 'బంపర్ ఆఫర్' సినిమా వచ్చిన విషయాన్ని తన దృష్టికి తీసుకు వచ్చారనీ, ఆ సినిమా చూసి అందులోని 15 సన్నివేశాల వరకూ తన కథలోని వాటినే వాడుకోవడం తనను అవాక్కయ్యేలా చేసిందనీ తెలిపారు.


Click it and Unblock the Notifications











