రూ. 1.5 కోట్లు...‘ఎవడు’ కొత్త రికార్డు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన 'ఎవడు' చిత్రం విడుదల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల లేటవుతున్నా అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. కాగా ఈ చిత్రం తాజాగా 'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్'లో రూ. 1.5 కోట్లు ఆర్జించి సరికొత్త రికార్డు నెలకొప్పింది.
'ఇన్-ఫిల్మ్ బ్రాండింగ్' అంటే మొబైల్ నెట్వర్కింగ్ సంబంధించిన అంశం. గతంలో అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం దీని ద్వారా రూ. కోటి ఆర్జిస్తే...తాజాగా రామ్ చరణ్ 'ఎవడు' ఆ రికార్డును బద్దలు కొట్టింది. దీన్ని బట్టి సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
'ఎవడు' చిత్రం డిసెంబర్ 19న విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఆయన తాజాగా ప్రకటించారు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు ప్రవేశ పెడితే సినిమా మరో నెల రోజులు వాయిదా వేస్తామని తెలిపారు.
'ఎవడు' సినిమా వాయిదా పడటం వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనే వాదనను ఇన్నాళ్లు తోసిపుచ్చుకుంటూ వచ్చిన దిల్ రాజు...ఎట్టకేలకు ఆ విషయాన్ని తన నోటితో ఒప్పుకోవడం గమనార్హం. ఆ మధ్య సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధం అవ్వగా....కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విభజన ప్రకటన చేస్తుందనే సంకేతాలు చిరంజీవి ద్వారా తెలుసుకున్న దిల్ రాజు ముందు జాగ్రత్తగా సినిమా విడుదల నిలిపి వేసారు. అపుడు సినిమాను నిలిపి వేయడమే మంచిదైంది. లేకుంటే ఆందోళనల కారణంగా సినిమాకు తీవ్ర నష్టం ఏర్పడేది.


Click it and Unblock the Notifications












