Jana Gana Mana Movie Review: మనసున్న ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే సినిమా!
సినిమా: జనగణమన
నటీనటులు: పృథ్వీరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజారమూడు, మమతా మోహన్దాస్ తదితరులు
సంగీతం: జేక్స్ బిజోయ్
నిర్మాణ సంస్థ: పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: డిజో జోస్ ఆంటోనీ
స్ట్రీమింగ్ ప్లాట్ఫాం: నెట్ఫ్లిక్స్
డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమా మీద ఆసక్తి పెరిగింది. కరోనా సమయంలో మలయాళ సినిమాలు ఎక్కువగా చూసిన తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమా మీద ఆసక్తి పెంచుకున్నారు. ఇప్పటికే మలయాళం నుంచి పలు సినిమాలు తెలుగులో రీమేక్ అవుతుండగా మలయాళ సినీ దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలను తెలుగులో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన జనగణమన అనే సినిమా మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. అదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేశారు కానీ పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడంతో సినిమా వచ్చి వెళ్లి పోయింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు.. తాజాగా ఈ సినిమాను జనవరి 2022 పేరుతో తెలుగులో నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది అనేది సమీక్షలో తెలుసుకుందాం

కథ:
సభా మరియన్(మమతా మోహన్ దాస్) అనే ఒక కాలేజీ ప్రొఫెసర్ మృతదేహం రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో కనిపిస్తుంది. అయితే ఆమెను అత్యాచారం చేసి చంపేశారని తరువాత రోడ్డు మీద మృతదేహాన్ని పడేసి కాల్చివేశారు అని మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. కాలేజీలో కూడా సభా ఎంతో మంది విద్యార్థులకు ఇష్టమైన ప్రొఫెసర్ కావడంతో ఆమె మృతి విషయంలో కాలేజీలో అల్లర్లు చెలరేగుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేసును ఏసీపీ సజ్జన్ కుమార్(సూరజ్)కు అప్పగిస్తుంది. ఈ క్రమంలో ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పిన కథనం ఆధారంగా నలుగురిని వేటాడి అరెస్టు చేస్తాడు. అయితే పైనుంచి వచ్చిన ప్రెజర్ కారణంగా ఈ కేసులో ముద్దాయిలు అందరినీ హెడ్ ఆఫీస్ కి తరలించాలని ఆదేశాలు అందుతాయి. అయితే వేరే స్టేషన్ కి షిఫ్ట్ చేసే సమయంలో వారిని బూటకపు ఎన్ కౌంటర్ చేసి చంపేస్తాడు. అయితే ఇవేమీ పట్టని ప్రజలు ఆయనను వేనోళ్ళ పొగిడారు. అలాంటి సజ్జన్ కుమార్ బూటకపు ఎన్ కౌంటర్ గురించి ప్రజలకు ఎలా తెలిసింది? అరవిందన్ స్వామినాథన్ (పృథ్వీరాజ్ సుకుమారన్) పాత్ర ఏమిటి? తెలిసిన తర్వాత ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :
సినిమా చూడటం మొదలు పెట్టిన కొద్దిసేపటికి ఈ కథ మీకు బాగా తెలిసిన కథే అనిపిస్తుంది. హైదరాబాద్ శివార్లలో కలకలం రేపిన ఒక వెటర్నరీ వైద్యురాలి హత్యకు చాలా దగ్గరగా ఈ హత్య కూడా కనిపిస్తుంది. చూడడానికి సినిమాల్లాగానే కనిపించిన మొత్తం సిస్టంని ప్రశ్నించే సినిమా ఇది. ఒక సంఘటన జరిగినప్పుడు మీడియా ఎలా ప్రవర్తిస్తుంది? మీడియా కథనాలు చూసి ప్రజలు ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయాల మీద ఏ మాత్రం రాజీ లేకుండా తాము చెప్పాల్సింది చెప్పేశారు దర్శకుడు. ఇలాంటి సినిమాల్లో నటించడమే కాక నిర్మించడానికి పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఎన్ని గుండెలో అని అనిపించక మానదు. సినిమా ప్రారంభమైన కొద్ది సేపటికే సినిమా మీద ఆసక్తి పెంచడంలో కూడా దర్శకుడు ఆంటోని సఫలమయ్యాడు. కోర్టు డ్రామా అయినా ఎక్కడా కూడా కొంచెం సేపు కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను అలరించగలిగాడు.

దర్శకుడు టేకింగ్ విషయానికి వస్తే
డిజో జోస్ ఆంటోనీ ఒక హానెస్ట్ అటెంప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి భాగం అంతా సూరజ్ ఒక హీరోలాగా అందరికీ అనిపించేటట్టు చేయడంలో కూడా సఫలం అయ్యాడు. కానీ అసలు కథ అంతా రెండో భాగంలోనూ మొదలవుతుంది కోర్టు రూమ్ లో దాదాపు గంటకు పైగా ఈ సినిమాను నడిపించాడు. ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ లో కనిపించిన ప్రతి సన్నివేశానికి ఉన్న మరో కోణాన్ని రెండో భాగంలో కళ్ళకు కట్టినట్లు చూపించి ఔరా అనిపించాడు దర్శకుడు. అయితే ప్రతి విషయంలోనూ డీటెయిలింగ్ ఎక్కువవడంతో కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా రాసుకున్నాడు దర్శకుడు.

నటీనటుల పనితీరు:
నటీనటుల పనితీరు విషయానికి వస్తే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ లాయర్ గా మారిన ఒక పోలీస్ అధికారి పాత్రలో నటిస్తాడు. సినిమా ప్రారంభం అయి రెండో భాగం వచ్చేవరకూ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్ర జాడే ఉండదు. అయితే ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు సజ్జన్ కుమార్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న సూరజ్ నటనను కూడా పక్కకు నెట్టివేసి పృథ్వీరాజ్ సుకుమారన్ అందరి చూపు తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ మధ్యనే సినిమాలలో మళ్లీ బిజీ అవుతున్న మమతామోహన్దాస్ కూడా చేసింది చిన్న పాత్రే అయినా సినిమా మొత్తానికి ఆయువుపట్టు లాంటి పాత్ర కావడంతో ఆమె నటనకు కూడా మంచి ప్రాధాన్యత ఏర్పడింది. మిగతా వాళ్ళు తమ తమ పాత్ర పరిధి మేర నటించారు.

టెక్నికల్ విషయానికి వస్తే
ముఖ్యంగా ఈ సినిమాలో మాట్లాడు కోవాల్సింది నేపథ్య సంగీతం గురించి జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా మొత్తం మీద ప్రేక్షకులలో కాస్త ఆసక్తి పెరగడానికి ఆయన సంగీతం బాగా ప్లస్సయింది/ అయితే సెకండ్ హాఫ్ విషయంలో సినిమాటోగ్రాఫర్ మాయాజాలం పనిచేసింది. ఒకే లొకేషన్ లో ఈ సెకండ్ అంతా దాదాపుగా ఉంటుంది. సమయంలో కూడా సినిమాటోగ్రాఫర్ తనదైన మ్యాజిక్ తో సినిమా మీద ఏ మాత్రం బోర్ కొట్టకుండా చేశాడు. అయితే మొదటి భాగం విషయంలో ఎడిటింగ్ టేబుల్ మీద మరి కొంత దృష్టి పెట్టి ఉంటే బాగుండు అనిపిస్తుంది.

ఫైనల్ గా చెప్పాలంటే
ఇది ఒక థ్రిల్లర్ జోనర్ మూవీ, కాస్త ఇబ్బందికర సన్నివేశాలు ఉంటాయి కానీ కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన సినిమా. వార్తలలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు, మనం నేరుగా చూడకుండా విన్న విషయాల ద్వారా మనం ఎలా ప్రభావితం అవుతున్నాం అనే అంశాలను ఈ సినిమా స్పృశించింది. అలా చూసిన ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది ఈ సినిమా.


Click it and Unblock the Notifications











