Telugu Indian Idol: విజేతగా వాగ్దేవి.. ప్రైజ్మనీతో పాటు చిరంజీవి ఆఫర్.. ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే!
కొంత కాలంగా తెలుగులోనూ ఓటీటీ ప్లాట్ఫామ్స్కు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గతంలో సినిమానో, సీరియల్నో చూడాలంటే టీవీల ముందు వాలిపోవాల్సిన పరిస్థితులు కనిపించేవి. అయితే, ఇప్పుడు ఓటీటీల వల్ల సెల్ఫోన్లోనే సమస్తం అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా వీటి వినియోగం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగులో అల్లు అరవింద్ ఆహా అనే ఓటీటీ ప్లాట్ఫామ్ను మొదలెట్టిన విషయంత తెలిసిందే. ఇందులో సరికొత్త కార్యక్రమాలు, సినిమాలు, స్పెషల్ వెబ్ సిరీస్లు, షోలు తెస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో 'తెలుగు ఇండియన్ ఐడల్' అనే షోను పరిచయం చేశారు. తాజాగా ఈ షో ఫినాలే కూడా ముగిసింది. ఇందులో విజేత గురించి తెలుసుకుందాం పదండి!

తెలుగు ఇండియన్ ఐడల్ ఇలా
తెలుగు గడ్డపై బెస్ట్ సింగర్లను గుర్తించేందుకు ఆహా తీసుకొచ్చిన షోనే 'తెలుగు ఇండియన్ ఐడల్'. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యా మీనన్, ప్రముఖ సింగర్ కార్తీక్ జడ్జ్లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీరామచంద్ర హోస్ట్గా చేస్తున్నాడు. ఇది 30 ఎపిసోడ్ల పాటు సాగబోతున్నట్లు తెలిసింది. ఈ షో ఆడిషన్స్ కోసం కొన్ని వందల మంది వచ్చి ఆరంభంలోనే హైప్ పెంచారు.

భారీగా రెస్పాన్స్... సూపర్ హిట్
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన 'తెలుగు ఇండియన్ ఐడల్' షోకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీనికి సంబంధించి మొత్తం 30 ఎపిసోడ్స్ ప్లాన్ చేయగా.. అన్ని అదిరిపోయే రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులోకి సెలెబ్రిటీలు గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్స్ మరింత హిట్ అయ్యాయి. ఫలితంగా ఈ షో సూపర్ హిట్ అయిపోయింది.

ఫినాలే కోసం చిరంజీవి ఎంట్రీ
'తెలుగు ఇండియన్ ఐడల్' సెమీ ఫైనల్స్ కోసం నటసింహా నందమూరి బాలకృష్ణ వచ్చారు. ఇక, జూన్ 17న జరిగిన ఫినాలే ఎపిసోడ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇందులో సింగర్స్ పాడిన పాటలను ఎంజాయ్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరినీ స్వతహాగా అభినందించారు. అలాగే, కొందరికి స్పెషల్ గిఫ్టులు కూడా ఇచ్చి తెగ సందడి చేసేశారు.

మొదటి సీజన్ విజేతగా వాగ్దేవి
'తెలుగు ఇండియన్ ఐడల్' ఫినాలేలో టైటిల్ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, వైష్ణవిలు పోటీ పడ్డారు. వీళ్లంతా ఫినాలేలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే, ఇందులో జూనియర్ పూజా హెగ్డేగా గుర్తింపు పొందిన బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచింది. ఆమె పేరును ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు.

ప్రైజ్మనీ.. రన్నర్స్ ఎవరంటే
'తెలుగు ఇండియన్ ఐడల్' మొదటి సీజన్లో విజేతగా నిలిచిన బీవీకే వాగ్దేవికి రూ. 10 లక్షలు ప్రైజ్మనీ లభించింది. అలాగే, స్పాన్సర్స్ నుంచి మరో రూ. 6 లక్షలు వచ్చాయి. ఇక, ఇందులో మొదటి రన్నరప్గా శ్రీనివాస్ నిలిచాడు. అలాగే, రెండో రన్నరప్గా వైష్ణవి ఎంపికైంది. వీళ్లకు కూడా ఆహా సంస్థ ప్రైజ్మనీ ఇచ్చింది. అలాగే, స్పాన్సర్స్ కూడా మనీని అందజేశారు.

వాళ్లందరికీ చిరంజీవి అవకాశం
'తెలుగు ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్లో విన్నర్ అయిన వాగ్దేవికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ ఇచ్చారు. అలాగే, ఆమెకు గీతా ఆర్ట్స్ బ్యానర్లో పాడే అవకాశం కూడా దక్కింది. ఇక, ఈ సీజన్లో సెకెండ్ రన్నరప్గా నిలిచిన వైష్ణవికి ఏకంగా చిరంజీవి తన తదుపరి చిత్రం 'భోళా శంకర్'లో పాట పాడే అవకాశం కల్పించారు. మిగిలిన వాళ్లకు జడ్జ్లు సాయం చేస్తానని చెప్పారు.

వాగ్దేవి బ్యాగ్రౌండ్ ఎంటో తెలిస్తే
నెల్లూరు జిల్లాకు చెందిన వాగ్దేవి చిన్న వయసులోనే సంగీతంలో శిక్షణ తీసుకుంది. అలా తన సింగింగ్ కెరీర్ను కొనసాగిస్తూనే ఇప్పుడు ఒరిస్సాలో బ్యాచ్లర్ ఆఫ్ ఆర్కిటక్చర్ చదువుతోంది. ఇకపై చదువు కొనసాగిస్తూనే సింగర్గా ఆమె కెరీర్ కంటిన్యూ చేయనున్నట్లు ఆమె వెల్లడించింది. ఇక, ఇందులో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది.


Click it and Unblock the Notifications











