కురుక్షేత్రం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
బాహుబలి విజయం అందించిన స్పూర్తితో దక్షిణాదిలో భారీ బడ్జెట్, అత్యంత సాంకేతికతతో కూడిన చిత్రాల జోరు కనిపిస్తున్నది. ఆ క్రమంలోనే వచ్చిన చిత్రం కురుక్షేత్రం. మహాభారతంలోని కీలక అంశాలను ఆధారంగా చేసుకొని ఉన్నత సాంకేతిక నైపుణ్యంతో 3డీ ఫార్మాట్లో రూపొందించడంతో భారీగా హైప్ క్రియేట్ అయింది. కన్నడ రంగంలో సెన్సేషనల్ హీరో దర్శన్ 50వ సినిమా కావడంతో నిర్మాత, ఎమ్మెల్యే మునిరత్న, దర్శకుడు నాగన్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను ఏ రకంగా ఆకట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ ఏంటో తెలుసుకొందాం.

కురుక్షేత్రం కథలో
మహాభారతంలోని పాండవులు, కౌరవుల మధ్య వైరం ప్రధాన అంశంగా కురుక్షేత్రం మూవీ సాగుతుంది. ధుర్యోధనుడు (దర్శన్), కర్ణుడికి (అర్జున్) పట్టాభిషేకం చేయడం, పాండవుల రాజసూయ యాగం సందర్భంగా అవమానానికి గురి కావడంతో దుర్యోధనుడు అహం దెబ్బ తింటుంది. ఆ ఘట్టమే మహాభారత యుద్ధానికి కీలక అంశంగా మారుతుంది.

కురుక్షేత్రంలో కీలక అంశాలు
పాండవులు జూదంలో ఓడిపోవడం, అలాగే కృష్ణరాయబారం, మహాభారత యుద్దం, అభిమన్ముడి పద్మవ్యూహం పోరాటం, తదితర అంశాలు సినిమాలో కీలక అంశాలుగా మారుతాయి. ఇలాంటి ఉద్వేగభరితమైన సన్నివేశాలను సరికొత్తగా 3డీ అనుభూతిని పొందాలంటే తెరపైన కురుక్షేత్రాన్ని వీక్షించాల్సిందే.

దర్శకుడు, నిర్మాణ విలువలు
దర్శకుడు నాగన్న దర్శకుడిగా పవిత్ర పురాణాన్ని తెరకెక్కించే విషయంలో ఎక్కడ తడబాటు కనిపించలేదు. ప్రతీ ఫ్రేమ్ను ఉన్నత విలువలతో చిత్రీకరించారు. జేకే భారవి రచన బాగుంది. మునిరత్న కథా సహాకారం, నిర్మాణ విలువలు దక్షిణాది సినీ ఖ్యాతిని ఇనుమడింప జేసేలా అనిపిస్తాయి. ఈ సినిమా కోసం ఉపయోగించిన గ్రాఫిక్స్ ఆకట్టుకొంటాయి. చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. నటీనటులు ఎంపికపై మరింత దృష్టిపెట్టాల్సిందేమో అనిపిస్తుంది.

నటీనటులు పెర్ఫార్మెన్స్
ముఖ్యంగా దర్శన్ నటన బాగుంది. సమకాలీన సినీ రంగంలో కమర్షియల్ అంశాలకే ప్రాధాన్యమిస్తున్న ఈ రోజుల్లో పౌరాణికానికి పెద్ద పీట వేస్తూ భార డైలాగ్స్ను అవలీలగా చెప్పే ప్రయత్నం చేశాడు దర్శన్. తనకు 50వ సినిమా కావడంతో తన నటనలో విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు కృషి చేశారనే ఫీలింగ్ కలుగుతుంది, అలాగే కర్ణుడిగా అర్జున్ నటన బాగుంది. భీష్ముడిగా దివంగత అంబరీష్ తనదైన శైలిలో నటించారు. సెకండాఫ్లో ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే సన్నివేశాల్లో అర్జున్ తన నటనకు పదను పెట్టారు. ద్రౌపదిగా(స్నేహ), అభిమన్యుడు (నిఖిల్ కుమార్ గౌడ) తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు. శల్యుడిగా రాక్ లైన్ వెంకటేష్, సుభద్రగా పవిత్రా లోకేష్ కనిపిస్తారు.

టెక్నికల్ విషయాల గురించి
సాంకేతిక విషయాలకు వస్తే.. జయనన్ విన్సెంట్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. తన అనుభవాన్ని రంగరించి ప్రతీ ఫ్రేమ్ను చక్కగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకు గ్రాఫిక్స్ హైలెట్. 3డీ అనుభూతి చక్కగా ఉంది. ముఖ్యంగా సెకండాఫ్లో యుద్దాన్ని చిత్రీకరించిన తీరు కొత్త అనుభూతికి గురిచేస్తుంది. వీ హరికృష్ణ సంగీతం మరో ప్రధానమైన ఆకర్షణ. సాహో రే సాహో పాట బాగుంది. జో ని హర్ష ఎడిటింగ్ ఫర్ఫెక్ట్గా ఉంది.

ఫైనల్గా
మహాభారతం సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. గతంలో దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం దక్షిణాదిలోనే ఉన్నత ప్రమాణాలకు దీటుగా నిలిచాయి. టెక్నాలజీతో అండతో అలాంటి అంచనాలకు సరితూగేలా ప్రయత్నం చేసిన తీరు అభినందనీయం. వింటే భారతం వినాలే అనే సామెత ఎప్పటికీ ఎవర్ గ్రీన్ కాబట్టి.. తెలుగు ప్రేక్షకుల ఆదరణ భారీగా లభించడానికి అవకాశాలు ఉన్నాయి. నవతరానికి మహాభారతం గురించి తెలియజేయాలంటే సాంకేతికతతో కూడిన కురుక్షేత్రం సినిమా చూడాల్సిందే. బీ, సీ సెంటర్లలో లభించే ఆదరణ బట్టి కమర్షియల్ సక్సెస్ ఆధారపడి ఉంటుంది.

ప్లస్, మైనస్ పాయింట్స్
బలం, బలహీనతలు
యుద్ధ సన్నివేశాలు
నటీనటులు ఫెర్ఫార్మెన్స్
సంగీతం
డైలాగ్స్
మైనస్ పాయింట్స్
నిడివి
తెలుగు వారికి పరిచయం లేని నటులు ఉండటం

తెర ముందు, తెర వెనుక
నటీనటులు: దర్శన్, అంబరీష్, వీ రవిచంద్రన్, అర్జున్ సజ్జా, సోనుసూద్, స్నేహ, నిఖిల్ కుమార్, పీ రవిశంకర్ తదితరులు
దర్శకత్వం: నాగన్న
నిర్మాత: మునిరత్న
కథ: మునిరత్న
రచన: జేకే భారవి
మ్యూజిక్: వీ హరికృష్ణ
సినిమాటోగ్రఫి: జయనన్ విన్సెంట్
ఎడిటింగ్: జో ని హర్ష
డిస్ట్రిబ్యూషన్: రాక్లైన్ ఎంటర్టైన్మెంట్ (కన్నడ), గీతా ఆర్ట్స్ (తెలుగు), వీ క్రియేషన్స్ (తమిళం)
బడ్జెట్: సుమారు 100 కోట్లు
రిలీజ్ డేట్: 2019-08-10


Click it and Unblock the Notifications











