దెయ్యం చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా! ('ఎక్కడికి పోతావు చిన్నవాడా' రివ్యూ)
నిఖిల్ కూడా హర్రర్ వైపు అడుగులు వేసాడు. అయితే ఇదో కమర్షియల్ హర్రర్ చిత్రంలా రూపొందించాడు. రెగ్యు లర్ హర్రర్ లా కాకుండా అందులోనే ఫాంటసీ, ప్రేమకథ, వినోదం మేళవించి తీసిన చిత్రం.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
తెలుగులో హర్రర్ సినిమాలు ఎంత రొటీన్ అయ్యిపోయాయంటే... దెయ్యం తెరమీదకు వస్తూంటే భయపడాల్సింది పోయి నవ్వేస్తున్నారు. అదే ఆడ దెయ్యం తెరపై కనపడితే .. ఆమె ఒంపుసొంపులు గమనిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే దెయ్యాలతో క్యాబరే డాన్స్ లు కూడా పెట్టేస్తారేమో అని డౌట్ వస్తున్న ఈ పరిస్దితుల్లో దెయ్యం, ఆత్మ అంటూ కథతో రావటం హీరో నిఖిల్ ధైర్యమే అనిపిస్తుంది.
కానీ సినిమా చూసాక, నిఖిల్ చాలా తెలివిగా ట్రెండ్ లో ఉండే..రొటీన్ ని బ్రేక్ చేసే దెయ్యం సారీ ఆత్మ కథతో వచ్చాడని అర్దమయ్యింది. కామెడీతో నవ్వించి, ఆత్మలతో కొద్దిగా భయపెట్టి, ప్రేమ కథతో ఫీల్ రప్పించి, టోటల్ గా దెయ్యంతో కమర్షియల్ సినిమా చూపించి సూపర్ గా ఉందే అనిపించింది. ఇది మనుష్యులకే కాదు దెయ్యాలకు కూడా నచ్చి , మెచ్చుకుని తమ ప్రేమ కథ ని గర్వంగా చెప్పుకునే లవ్ స్టోరీ.
హృదయం ఎక్కడ ఉన్నది, టైగర్ చిత్రాలతో పరిచయమైన ఈ దర్శకుడు ఆనంద్..ఈ సారి సాలిడ్ గా హిట్ కొట్టాడనే చెప్పాలి. ముఖ్యంగా దెయ్యం సినిమాలో పవన్ కళ్యాణ్,విజయవాడ వంటి విషయాలతో కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించటం బాగుంది. చిత్రం కథ , హైలెట్స్ క్రింద చూద్దాం.

ఎదురుచూపులే కానీ..
ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన అర్జున్ (నిఖిల్) తన ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే తను ప్రేమించిన అమ్మాయి ఆయేషాను పెళ్లి చేసుకోవటానికి రిజిస్టర్ ఆఫీసుకు బయిలుదేరతాడు. స్నేహితులతో అక్కడికి వెళ్లిన అతనికి ఎంతసేపు ఎదురుచూసినా ఆమె రాదు. దాంతో అతనికి ఏం చేయాలో అర్దం కాదు. అవతల ఆయేషా పోన్ ఎత్తడు. చివరకు నిరాశతో ఇంటికి వెళ్లిపోతాడు. జీవితంలో ఇంకెవరి కోసం ఎదురూచూడకూడదని ఫిక్స్ అవుతాడు.

మహిషాసర దేవాలయం
కాలగమనంలో ఆయేషాను మర్చిపోయి...గ్రాఫిక్స్ డిజైనర్ గా సెటిలవుతాడు. బాహుబలి 2 కు గ్రాఫిక్స్ చేస్తున్న అతను తప్పనిసరి పరిస్దితుల్లో కేరళ లలోని మహిషాసుర మర్దిని ఆలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకూ అంటే...తన ప్రెండ్ కిషోర్ (వెన్నెల కిషోర్)ని పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి.

హెబ్బా పటేల్ తో
ప్రెండ్ కోసం కేరళలోని మహిషాసురమర్థిని ఆలయానికి వచ్చిన అర్జున్ కు .... అక్కడ అమల (హెబ్బా పటేల్) పరిచయం అవుతుంది. కేరళలో ఉన్న నాలుగు రోజుల్లోనూ అర్జున్, అమల బాగా దగ్గరవుతారు. ఇంక తెల్లారితే ప్రేమిస్తున్నానే విషయం చెప్తుంది అనుకున్న సమయంలో .. సడన్గా అర్జున్కి చెప్పకుండా తన సొంత వూరు విజయవాడ వెళ్లిపోతుంది అమల.

అర్జున్ షాక్
అమల ని వెతుక్కొంటూ విజయవాడ వెళ్తాడు అర్జున్. అయితే అమల మాత్రం అర్జున్ని ‘నువ్వెవరు.. నిన్నింత వరకూ చూడలేదే' అని ప్రశ్నిస్తుంది. అంతే కాదు.. ‘నాపేరు అమల కాదు.. నిత్య' అంటుంది. దాంతో అర్జున్ షాక్ అవుతాడు.

తను నిత్య నిజమే
అప్పుడే ఇంకో ట్విస్ట్ పడుతుంది అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది.

దెయ్యమే ఫోన్ చేసిందా
అదే సమయంలో మరోసారి అమల నుంచి అర్జున్ కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నా అని ఫోన్ చేసి చెపుతుంది అమల. అంటే ఆ దెయ్యమే ఫోన్ చేసిందా అనే సందేహం వస్తుంది. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ.

డైరక్టర్ గొప్పతనమే
నిజానికి ఈ కథ ...కథగా వినప్పుడు చాలా ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. అయితే దర్శకుడు దాన్ని తన ప్రెజెంటేషన్ స్కిల్స్ తో ఒప్పించి,ఎక్కడా తేలిపోకుండా చేయటంలోనే గొప్పతనం అంతా ఉంది. మంచి టెక్నీషిన్ గా కనిపించే ఈ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలోనూ తన పట్టుని ఈ సినిమాలో చూపించాడు.

ప్రేమ కధా చిత్రమ్ లాగ
ఈ సినిమా హర్రర్ మీద కన్నా ఎక్కువగా కామెడీమీదే దృష్టి పెట్టడం ప్లస్ అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత వచ్చే కామెడీ ఎపిసోడ్స్ బాగా నవ్చించాయి..ప్రేమ కథా చిత్రమ్ లోని కామెడీ ఎపిసోడ్స్ గుర్తు చేసాయి. ఓ ప్రక్కన తెరపై పాత్రలకు దెయ్యం భయం, చూసే ప్రేక్షకుడుకు కామెడీ. ఆ పాట్రన్ బాగా వర్కవుట్ అయ్యింది.

ఆ హాలీవుడ్
ఇక ఈ చిత్రం Over Her Dead Body (2008) అనే హాలీవుడ్ చిత్రం నుంచి ప్రేరణ పొందినట్లుగా అనిపిస్తుంది. కాన్సెప్టు ఒకటే కానీ, స్క్రీన్ ప్లే వేరు గా ఉంటుంది. అయితే చిన్న స్టోరీ లైన్ తీసుకుని అందులో ఇమిడేలా సీన్స్ వేసుకుంటూ వెళ్లటం చూస్తూంటే స్క్రిప్టుపై బాగా కసరత్తు చేసారని అర్దమవుతుంది.

లేకపోతే ఇబ్బంది అయ్యేది
వరస పెట్టి వస్తున్న దెయ్యాల సినిమాల్లో ఒక దెయ్యం..పగ తీర్చుకునే కార్యక్రమం ఉండటం జరుగుతోంది. అయితే ఇక్కడే ఈ కథ విభేధిస్తూ..ఓ దెయ్యం ప్రేమ కథగా మలవటమే సక్సెస్ అయ్యింది. లేకపోతే రొటీన్ ట్రాక్ లాగ మారిపోయేది. ఈ సినిమా గురించి పెద్ద మాట్లాడుకునే పని ఉండేది కాదు.

ఇంటర్వెల్ లో ...
స్నేహితుడికి దెయ్యం వదిలించటం కోసం కేరళ వెళ్లిన హీరో అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో వచ్చే సీన్స్ అన్నీ అప్పుడప్పుడూ నవ్విస్తూ, ఆసక్తిని రేకెత్తిస్తూ.. సరదాగా సాగిపోతాయి. అయితే నిఖిల్, హెబ్బాపటేల్ల మధ్య సాగిన సన్నివేశాలు కొద్దిగా సాగదీసినట్లు అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ ముందొచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. అదే సినిమాకు హైలెట్ గా నిలబెట్టింది.

క్లైమాక్స్ తేలిపోయింది అందుకే
సెకండాఫ్ లో చిత్రంలోని అసలు కథ మొదలవుతుంది. తనని వెంటాడుతున్న ఆత్మతో హీరో , అతని ఫ్రెండ్స్ పడే పాట్లు బాగా ఫన్ గా ఉండి,నవ్విస్తాయి. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే లవ్ ఎపిసోడ్లో ఓ సర్పైజ్ ఎలిమెంట్ ఉండటం, ఓ లవ్ స్టోరీ మిక్స్ చేయటం బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ అయిపోగానే కథ అయిపోయిన ఫీల్ వచ్చింది. దాంతో క్లైమాక్స్ సీన్స్ తేలిపోయాయి. అక్కడనుంచి ఎక్సటెన్షన్ లాగ ఉంది కానీ కథలో రియల్ టెన్షన్ లేదు

కీ సీన్స్ లో ..
ఈ సినిమాకు ...శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలించిందనే చెప్పాలి. ముఖ్యంగా కీ సీన్స్ లో అదరకొట్టాడు. ఇక. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి అని చెప్పాలి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ విజువల్ గా చాలా తెరకెక్కించారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది.

కేక పుట్టించింది
ఇక ఈ చిత్రంలో తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన నందితా శ్వేత బాగా చేసింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటన కేక పుట్టించింది. వీటిని చూసి అలాంటి పాత్రలకే ఆమెను పిలవకుండా ఉంటే బాగుంటుంది.

కొనసాగింపులాగ..
కుమారి 21 ఎఫ్ చిత్రంతో పరిచయమైన హీరోయిన్ హేబా పటేల్ ఈ సినిమాలో పాత్ర ..కుమారి 21 ఎఫ్ కు కొనసాగింపులా అనిపించింది. మరోసారి అల్లరి పిల్లగా అలరించింది. గ్లామర్ షో పై కాన్సర్టేషన్ పెట్టుకుంది.

కొద్దిసేపే కనిపించినా ఆమె..
ఇక ఉయ్యాల జంపాల పిల్ల.. అవికా గోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో ఒప్పించింది. ఆమె ఆ పాత్రకు ఫెరెఫెక్ట్ ఎంపిక అనిపించింది. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

పవన్ ఎలిమెంట్, మాటలు..
అబ్బూరి రవి అందించిన డైలాగులు చాలా చోట్ల విజిల్స్ వేయించాయి. బొమ్మరిల్లు లాంటి చిత్రాలకు భావోద్వేగాలతో సాగే డైలాగులు రాస్తారు అనుకునే ఆయనలోని కామెడీని కూడా బాగా పండించగలరని ఈ సినిమా అర్దమైంది. అలాగే సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలిమెంట్, విజయవాడ ప్రస్తావన బాగా వర్కవుట్ అయ్యింది

ఈ టీమ్ తోనే
బ్యానర్: మేఘన ఆర్ట్స్
తారాగణం: నిఖిల్, హెబ్బాపటేల్, నందితా శ్వేత, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, సత్య, తాగుబోతు రమేష్, జోష్ రవి, వైవా హర్ష, సుదర్శన్, భద్రమ్, అపూర్వ శ్రీనివాస్ తదితరులు
పాటల- రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి,
ఆర్ట్- రామాంజనేయులు,
ఎడిటర్- చోటా.కె.ప్రసాద్,
సంగీతం-శేఖర్ చంద్ర,
మాటలు- అబ్బూరి రవి
పి.ఆర్.ఓ- ఎస్.కె.ఎన్, ఏలూరుశీను
డి.ఓ.పి- సాయి శ్రీరామ్, తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర,
నిర్మాత: పి.వి.రావు,
రచన, దర్శకత్వం: వి.ఐ. ఆనంద్
నిడివి: 140 నిమిషాలు,
విడుదల తేదీ: 18-11-2016
ఫైనల్ గా... ఈ చిత్రం ఓ హర్రర్ కామెడీ కథని కమర్షియల్ పంధాలో ఎలా ప్రెజెంట్ చేయవచ్చో చూపించింది. అలాగే నోట్ల రద్దు సమయంలో ధియోటర్స్ కు జనం వస్తారో రారో అనుకుంటే ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఓపినింగ్స్ బాగా రాబట్టిన ఈ చిత్రం ఈ వీకెండ్ మంచి కాలక్షేపమే.


Click it and Unblock the Notifications











