ఇప్పటికీ న్యాయం జరగలేదు.. మనది అలాంటి సమాజం.. ‘మీటూ’పై మంచు లక్ష్మీ కామెంట్స్
మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. నిర్మాతగా, నటిగా, హోస్ట్గా, సామాజిక కార్యకర్తగా ఇలా ఎన్నో రకాలుగా మంచు లక్ష్మీ తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఆ మధ్య కూతురు విద్యా నిర్వాణతో కలిసి యూట్యూబ్ చానెల్ కూడా పెట్టింది. నేటి సమాజంలో పిల్లలు, పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను చూపెడుతోంది. ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని తెగ ఎంజాయ్ చేసిన మంచు లక్ష్మీ.. తాజాగా మీడియాతో ముచ్చిటించింది.

మళ్లీ ఇప్పుడే..
మీడియాతో మాట్లాడిన మంచు లక్ష్మీ అనేక విషయాలపై స్పందించింది. లాక్ డౌన్ సమయాన్ని ఎలా గడిపిందో చెప్పుకొచ్చింది. గత రెండు మూడు నెలలుగా నాన్న వద్దే ఉంటున్నానని, కాలేజీ రోజుల తర్వాత నాన్న, అమ్మ, విష్ణులతో ఎక్కువ రోజులు కలిసి ఉన్నది ఇప్పుడేనని తెలిపింది. నచ్చిన వంటలు చేసుకుని తినడం.. నచ్చిన సినిమా చూడటమే పని అని పేర్కొంది.

అది బాధగా అనిపించింది..
తామంతా ఇంట్లో ఎంచక్కా సంతోషంగా ఉంటే.. విష్ణు భార్య (విరానికా), పిల్లలు సింగపూర్లో చిక్కుకుపోవడం బాధగా అనిపించిందని తెలిపింది. అయితే ఇటీవలె వారు ఇండియాకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. వంద రోజుల తరువాత ఇండియాకు వచ్చామని విరానిక ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో పేర్కొంది.

ఆన్లైన్ క్లాసులు..
ప్రస్తుత సమయంలో మన పిల్లలు ఇంట్లో నుంచే ఆన్లైన్ తరగతులు వింటున్నారని తెలిపింది. మరి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందుకే విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలనే ‘టీచ్ ఫర్ చేంజ్' కార్యక్రమం చేస్తున్నానని పేర్కొంది.
Recommended Video

ఇప్పటికీ న్యాయం జరగలేదు..
‘మీటూ' ఉద్యమంలో వేధింపులపై గళం విప్పిన చాలా మందికి ఇప్పటికీ న్యాయం జరగలేదని తెలిపింది. పురుషాధిక్య సమాజం మనదని, మగవాళ్లే ప్రధానమని భావించే ఆలోచన విధానం కనిపిస్తుంటుందని పేర్కొంది. తాను, నందిని, సుప్రియ, స్వప్నదత్, ఝూన్సీ ఐదుగురం కలిసికట్టుగా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులపై పోరాడుతున్నామని వెల్లడించింది. ‘మీటూ' ఉద్యమం తర్వాత మహిళలపై వేధింపులకు పాల్పడేవారిలో భయాలు మొదలయ్యాయని చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











