జగదేక వీరుడికి 30 ఏళ్లు.. ప్రస్థానం ఎలా మొదలైందంటే.. నాటి విషయాలు చెప్పిన నాని
తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణాక్షరాలతొ లిఖించదగ్గ చిత్రం జగదేకవీరుడు అతిలోకసుందరి. చిరంజీవిని మెగాస్టార్ రేంజ్కు తీసుకెళ్లిన నాటి క్లాసిక్ చిత్రానికి మే 9తో ముప్పై యేళ్లు నిండుతాయి. ఈ సందర్భంగా క్లాసిక్ చిత్రం పురుడుపోసుకోవడానికి గల కారణాలు, ఎలా రూపుదిద్దుకుంది, ఎలా మొదలైంది.. వంటి ఆసక్తికరమైన విషయాలను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తెలుగు ప్రేక్షకులకు తెలుపుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఎవ్వరికీ తెలియన మూడు నిజాలను విడతలవారిగా విడుదల చేయనుంది. ఈ మేరకు మొదటిది నిన్న సాయంత్రం రిలీజ్ అయింది.
Recommended Video

మొదటి పది కోట్ల చిత్రం..
తెలుగు చిత్ర సీమలో మొదటి సారిగా పది కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా జగదేకవీరుడు అతిలోకసుందరి రికార్డులు క్రియేట్ చేసింది. బయట వర్షాలతో వరదలు వస్తే.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. ఈ చిత్రంతో చిరంజీవి రేంజ్ పూర్తిగా మారిపోయింది.

బిగ్గర్ దేన్ బచ్చన్..
అప్పట్లో కోటిరూపాయల పారితోషకం తీసుకున్న ఏకైక భారతీయ సినీ హీరో చిరంజీవి. ఈ మేరకు ప్రముఖ మ్యాగజైన్ బిగ్గర్ దేన్ బచ్చన్ అంటూ.. మొట్టమొదటి కోటి రూపాయల హీరో అని ప్రచురించింది. జగదేకవీరుడు సినిమా చిరంజీవి ఎవరెస్ట్ మీద కూర్చొబెట్టింది.
మూడు తేదీల్లో మూడు నిజాలు..
మూడు దశాబ్దాలు, మూడు కథలు, ఒక్క గొంతు.. అంటూ మే 5, 7, 9 తేదీల్లో నాని వాయిస్ ఓవర్ ద్వారా తెలియజేస్తామని వైజయంతీ మూవీస్ పేర్కొంది. ఈ మేరకు నిన్న రాత్రి మొదటి కథను విడుదల చేశారు. ఈ సినిమాకు బీజం ఎలా పడింది? ఎక్కడ పడింది? అనే విషయాలను నాని తెలిపాడు.

నాని చెప్పిన మొదటి కథ..
‘బ్లాక్ బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ జనరేషన్స్ మారినా ఎవర్ గ్రీన్గా ఉండే బ్లాక్ బస్టర్ల లిస్ట్లో ఫస్ట్ ఉండే సినిమా జగదేవక వీరుడు అతిలోక సుందరి. సినిమాను చూసే, సినిమాను తీసే విధానాన్ని మార్చే ఈ సినిమా ఎలా పుట్టింది? అశ్వనీదత్ గారికి ఏనాటి నుంచో ఎన్టీఆర్ జగదేక వీరుడు లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవి గారితో తీయాలని కల.. అది తాను ప్రేమగా బావ అనే పిలుచుకునే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలడని గట్టి నమ్మకం ఉండేదట.

అలా లైన్ మొదలైంది..
ఆఖరి పోరాటం తరువాత చిరంజీవి గారితో సినిమా అనుకున్నారు దత్తు గారు. ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రైటర్ కో డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తిని, రాఘవేంద్రరావు గారితో తిరుమలకు పంపించారు. ఇద్దరూ తిరుమలపై ఉండగా.. అశ్వనీదత్ గారి మనసు తెలిసిన శ్రీనివాస్ చక్రవర్తి.. భూమ్మీదకు వచ్చిన దేవకన్య ఉంగరం పోతుంది.. అది చిరంజీవికి దొరుకుతుంది. అని జస్ట్ ఊహను మాత్రమే చెప్పారు.అది రాఘవేంద్రరావు గారికి బాగా నచ్చింది. దత్తు గారి కలకు బాగా దగ్గరగా ఉంది.. ఆయనకూ నచ్చింది.

ఎందరో రచయితలు..
మరి జగదేకవీరుడికి అతిలోక సుందరి ఎవ్వరు? అందరి మదలో మెదిలింది ఒకే ఒక్కరు.. వైజయంతీ ఆస్థాన నాయిక, వెండితెర దేవత శ్రీదేవీ. క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. దానికి తగ్గ కథను సిద్దం చేసేందుకు వైజయంతీ ఆఫీస్లో రచయితల కుంభమేళా మొదలైంది. యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల గారితో మొదలై సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్, తమిళ్ రచయిత క్రేజీ మోహన్ ఇలా ఇందరు రచయితలతో సైన్యం సిద్దమైంది.

అందరి సమష్టి కృషి
చిరంజీవి గారు కూడా నెలరోజుల పాటు కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. దేవకన్యను అతిలోకసుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుడి లుక్లో ఉంటేనే బాగుంటుంది అందరూ కనెక్ట్ అవుతారని సలహా ఇచ్చారు. మరోవైపు బాంబేలో తన క్యాస్టూమ్స్ తానే డిజైన్ చేసుకోవడం మొదలుపెట్టారు శ్రీదేవీ. ఇలా అందరూ కలిసి సమష్టి కృషితో ఈ అందమైన చందమామ కథను తెలుగు సినీ చరిత్రలో మరుపురాని అద్భుతకావ్యంగా మలిచారు. చరిత్రను సృష్టించిన ఈ సినిమ ఇంత ఈజీగా అయిపోయిందని అనుకుంటున్నారా? చూస్తూనే ఉండండి' అంటూ నాని అద్భుతంగా చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











