రజనీ 2.0ను నష్టపరిచేందుకు ప్లాన్.... రహస్యంగా ఆపరేషన్ షురూ!
సినిమా రంగాన్ని ప్రధానంగా వేధిస్తున్న అంశం పైరసీ. ఇండియాలో గత కొన్నేళ్లుగా తమిళ రాకర్స్ అనే ఆన్లైన్ పైరసీ పెద్ద హీరోల సినిమాలను తీవ్రంగా నష్టపరుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్ మూవీ 'సర్కార్' విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో పాటు వడ చెన్నై, థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ చిత్రాలకు ఈ పైరసీ ముప్పు తప్పలేదు.
రేపు విడుదలకాబోతోన్న రజనీకాంత్ మూవీ 2.0 చిత్రాన్ని సైతం మొదటి షో పడ్డ కొన్ని గంటల్లోనే పైరసీ చేస్తామని తమిళ రాకర్స్ బెదిరింపులకు దిగారు. అదే జరిగితే రూ. 600 కోట్ల మెగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ నష్టం తప్పదు.

రహస్యంగా ఆపరేషన్ షురూ
దీంతో చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రంగంలోకి దిగింది. 2.0 పైరసీ అడ్డుకునేందుకు పది మందితో కూడిన స్పెషల్ టీమ్ను ఏర్పాటు చేసింది. వారు ఇప్పటికే రహస్యంగా తమ కార్యకలాపాలను మొదలు పెట్టారట. పైరసీ అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనే విషయాలు బయటకు పొక్కకుండా చకచకా తమ పని కానిస్తోందట.

యాంటీ పైరసీ అధికారులు కూడా
మరో వైపు ఢిల్లీ, చెన్నైలో యాంటీ పైరసీ అధికారులు సైతం 2.0 ఆన్ లైన్లో లీక్ కాకుండా తగిన చర్యలు చేపట్టారు. ఒక వేళ తమిళ రాకర్స్ సినిమా పైరసీ ప్రింట్ ఆన్ లైన్లో పెట్టినా అవి ఓపెన్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

పైరసీ అడ్డుకోవడం సాధ్యమేనా?
అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన తమిళరాకర్స్ను అడ్డుకోవడం ఎవరి తరం కాదనే వాదన మరో వైపు వినిపిస్తోంది. గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదని గుర్తు చేస్తున్నారు. ఒక లింక్ బ్లాక్ చేస్తే వెంటనే మరో లింకు క్రియేట్ చేస్తూ పైరసీ దారులు రెచ్చిపోతుండటమే అందుకు కారణం.

3డి థియేటర్లో చూస్తేనే అసలు మజా
వందల కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిలో రూపొందించిన 2.0 చిత్రాన్ని 3డి ఎఫెక్ట్ ఫీలవుతూ థియేటర్లో చూస్తేనే అసలు మజా ఉంటుందని, పైరసీ చూడటం వల్ల సంతృప్తి ఉండదని, ఈ చిత్రాన్ని తాము పెద్ద తెరపై మాత్రమే చూస్తామని రజనీ అభిమానులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











