తమిళతెరపైనా ఉదయకిరణ్ ముద్ర ఇలా...
చెన్నై: రివ్వున దూసుకొచ్చి, ఆత్మహత్యతో తన కెరీర్ను అర్థాంతరంగా ముగించిన ఉదయకిరణ్ తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నాడు. ఓ అనువాదంతో తమిళ ప్రేక్షకులను పలకరించిన ఆయన, అనంతరం మూడు నేరు తమిళ చిత్రాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకూ సుపరిచితుడయ్యాడు.
తెలుగులో తెరంగేట్రం చేసిన 'చిత్రం' సినిమా ద్వారానే ఆయన తమిళ ప్రేక్షకుల చెంతకు వచ్చారు. 'సిత్తిరం'గా అనువాదమైన ఆ చిత్రం కళాశాల కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. చక్కని ప్రచారం కల్పించి ఉంటే ఇక్కడా విజయం దక్కేదనే వార్తలు అప్పట్లో వినిపించాయి. తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సైతం మంచి క్రేజ్ తెచ్చుకుంది.\

దర్శక శిఖరం కె.బాలచందర్ దర్శకత్వంలో నటించటం ప్రతి హీరో కల. ఆ కలను అనతికాలంలోనే అందుకున్నాడు ఉదయకిరణ్. ఆయన దర్శకత్వంలో, విలక్షణ నటుడు ప్రకాష్రాజ్ నిర్మించిన 'పొయ్' చిత్రంలో ఉదయకిరణ్ నటించారు. ఆయన నేరుగా నటించిన తొలి తమిళ చిత్రమిది. ఇందులో ఆయనకు జంటగా విమలారామన్ కనిపించింది.
తన రెండో చిత్రంగా 'వంబుసండై' అవకాశాన్ని దక్కించుకున్న ఉదయకిరణ్ అందులో విలక్షణ నటుడు సత్యరాజ్తో కలిసి వెండితెరను పంచుకున్నాడు.ఈ చిత్రం 2008లో ప్రేక్షకుల చెంతకు వచ్చింది.
కె.బాలచందర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్న ఉదయకిరణ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి రచించిన కథతో రూపొందిన 'పెన్సింగం'లోనూ హీరోగా నటించారు. కరుణానిధి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే.. అంటే 2010లో ఈ చిత్రం తమిళంలో సందడి చేసింది.
ప్రస్తుతం తమిళంలో తన నాలుగో చిత్రంగా సుధాకర్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించిన ఉదయకిరణ్ ఆ చిత్రం సెట్స్పైకి వెళ్లకముందే తన జీవితానికి విషాద ముగింపు పలికారు.


Click it and Unblock the Notifications











