Thunivu సంబరాల్లో అపశృతి.. థియేటర్ వద్ద ఘోర ప్రమాదం.. తీవ్ర దిగ్బ్రాంతిలో అజిత్!
సంక్రాంతి పండుగ కానుకగా తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన తునివు చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా జనవరి 11వ తేదీన రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్తో దూసుకెళ్తున్నది. అయితే అజిత్ సినిమా రిలీజ్ సందర్భంగా తమిళనాడు వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది. అయితే ఈ వేడుకల్లో అపశృతి చోటుచేసుకొన్నది. ఈ విషాద సంఘటన వివరాల్లోకి వెళితే.

సినిమా హాళ్ల వద్ద డీజేలతో
అజిత్ నటించిన తునివ్ సినిమా అట్టహాసంగా తమిళనాడు వ్యాప్తంగా రిలీజైంది. చెన్నైలో భారీ ఎత్తున్న సెలబ్రేషన్స్ నిర్వహించారు. థియేటర్లను అలకరించారు. సినిమా హాళ్ల వద్ద డీజేలతో హోరెత్తించారు. ప్రతీ థియేటర్ వద్ద బాణాసంచా కాల్చి పండుగ చేసుకొన్నారు. ఈ వేడుకలు ఉత్సాహంగా, జోరుగా సాగుతున్న సమయంలో అభిమానులను విషాదానికి గురిచేసే సంఘటన చోటుచేసుకొన్నది.

అభిమాని లారీపై నుంచి పడి
చెన్నైలోని కోయంబెట్ ప్రాంతంలోని రోహిణి థియేటర్లో ప్రదర్శిస్తున్న తునివ్ సినిమా కోసం భారీగా ఫ్యాన్స్ పోటెత్తారు. ఈ సందర్భంగా లారీపై అభిమానులు నృత్యాలు చేసి తమ సంతోషాన్ని, అభిమానాన్ని చాటుకొన్నారు. హఠాత్తుగా నృత్యం చేస్తున్న ఓ అభిమాని లారీపై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. దాంతో అభిమానిని హాస్పిటల్కు తరలించారు.

అభిమాని మరణంతో విషాదం
అయితే లారీ నుంచి పడిపోయిన అభిమానిని చిందారీపేట్లోని రిచీ స్ట్రీట్కు చెందిన భరత్కుమార్గా గుర్తించారు. అయితే హాస్పిటల్లో చేర్చిన భరత్ కుమార్ వెన్నుముకకు తీవ్ర గాయం కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ భరత్ తుదిశ్వాస విడిచారు. దాంతో అజిత్ ఫ్యాన్స్లో, స్థానికుల్లో విషాదం నెలకొన్నది.

అభిమాని కుటుంబానికి అజిత్ కుమార్ పరామర్శ
అభిమాని భరత్ కుమార్ మరణం సూపర్ స్టార్ అజిత్ కుమార్కు తీవ్ర విషాదం మిగిల్చింది. భరత్ మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురైన అజిత్.. తన అభిమాని కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించినట్టు అభిమాన సంఘాలు నేతలు చెప్పారు. అభిమాని మరణంతో తీవ్ర విషాదంలో కూరుకుపోయిన కుటుంబానికి అజిత్ ధైర్యం చెప్పినట్టు సమాచారం. త్వరలోనే వారిని కలిసేందుకు సిద్దమవుతున్నట్టు తెలిసింది.

స్పెషల్ షోలు రద్దు చేయాలి అంటూ
అయితే తమిళనాడులో స్పెషల్ షోల కారణంగా తరుచూ ప్రమాదాలు జరగడంపై పలువురు అందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల వరకు నిర్వహించే స్పెషల్ షోలపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అర్ధరాత్రి శాంతి, భద్రతలు, ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, భరత్ కుమార్ మృతిపై పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications











