మ్యూజికల్ నైట్: అనూష్క, దేవిశ్రీప్రసాద్, కార్తీ...(ఫోటో ఫీచర్)
చెన్నై : 'తీపెట్టిక్కు రెండు పక్కం ఉరసనా ఎరియుం. ఆనా.. ఇంద అలెక్స్ పాండియనుక్కు ఎందపక్కం ఉరసనాలుం తీ పత్తి ఎరియుం' (అగ్గిపెట్టెకు రెండువైపులా రాస్తే నిప్పు పుడుతుంది. కానీ ఈ అలెక్స్ పాండియన్ను ఎటువైపు రాసినా మంటలు చెలరేగుతాయ్)
- 'మూండ్రుముగం' చిత్రంలో రజనీకాంత్ పోషించిన అలెక్స్ పాండియన్ పాత్ర పలికే మాటలివి. ఆ పాత్ర పేరునే సినిమా శీర్షికగా పెట్టుకుని వస్తున్నాడు కార్తి.
సురాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అలెక్స్ పాండియన్' సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెరపైకి రానుంది. ఈ చిత్రాన్ని తెలుగులో బ్యాడ్ బోయ్ టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇటీవలే పాటలు విడుదలయ్యాయి. దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రేక్షకాభిమానులతో చెన్నైలో మ్యూజికల్ నైట్ జరిపింది.
చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా తమ స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం ఈ మ్యూజికల్ నైట్ ఎరేంజ్ చేసారు. చెన్నై YMCA గ్రౌండ్స్ ఈ నైట్ కి వేదిక అయ్యింది. ఈ వేడుకలో సినిమా యూనిట్ తో పాటు, నటీనటులు,సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

కార్తి, అనుష్క, సురాజ్, నిర్మాత జ్ఞానవేల్రాజాతో పాటు సూర్య, ఎస్జే సూర్య, సుశీంద్రన్, లింగుస్వామి, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.

'ఐయామ్ ఏ బ్యాడ్... బ్యాడ్ బాయ్..' అంటూ సాగే 'అలెక్స్ పాండియన్'లోని పాట ఇప్పుడు పిల్లల నోట కూడా వినిపిస్తోంది. సినిమాకు ముందే స్వరాలు ఆకట్టుకుంటున్నాయి. వాటిని జనానికి మరింత దగ్గరగా తీసుకెళ్లాలనే ఆలోచనతో పాటల పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం నీతూచంద్ర, దన్షికలు సూర్య, కార్తిల పాటలకు చిందేసి ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత వేదికనెక్కిన యువ సంగీతకెరటం దేవిశ్రీప్రసాద్ ఆహూతులను ఉర్రూతలూగించారు. తనదైన శైలిలో పాటలు పాడి హుషారు తెప్పించారు.

నటుడు కార్తిని వేదికపైకి తీసుకొచ్చి దేవిశ్రీప్రసాద్ అడుగులు వేయించారు. అనుష్కను కూడా వేదికనెక్కించి మాట్లాడించారు.

సూర్య మాట్లాడుతూ... ఇంట్లో బాధ్యతలను కార్తి నాకన్నా బాగా చూసుకుంటాడు. అతనిలో నచ్చిన విషయం అదే. నటనలో కార్తికి సూచనలిచ్చారా అని అడుగుతున్నారు. అసలు అభినయం గురించి అతనికి నేర్పించాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా ఎంతో కష్టపడి తెరకెక్కించారు. ఆశించిన స్థాయిలో విజయం దక్కుతుంది. కుటుంబంతో పాటు వెళ్లి థియేటర్లో చూడదగ్గ చిత్రమిది.

హీరో కార్తి మాట్లాడుతూ... 'సిరుతై' తర్వాత మంచి యాక్షన్ చిత్రంలో నటించాలని అనుకున్నా. అప్పుడే నాకు సురాజ్ గుర్తుకొచ్చాడు. ఆయన తెరకెక్కించిన 'నగరం', 'పడిక్కాదవన్' బాగా నచ్చాయి. అందులో పోరాటాలతో పాటు హాస్యం కూడా ఉంది. అందుకే సురాజ్ దర్శకత్వంలో నటించాలనుకున్నా. అలా 'అలెక్స్ పాండియన్' మీ ముందుకొస్తోంది. రైలుపై వెళుతూ పోరాడే సన్నివేశం కోసం చాలా శ్రమించాం. పైనుంచి హెలికాప్టర్ ద్వారా దాడి చేస్తుంటారు. హెలికాప్టర్ గాలికి నేను, అనుష్కలు పడిపోయాం. అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడి ఈ రోజు మీముందు మాట్లాడుతున్నాం. సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఆదరిస్తారని నమ్ముతున్నా. గుడ్బాయ్గా ఉన్న నేను ఈ సినిమాతో బ్యాడ్బాయ్గా మారా.

ప్రముఖ దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ... హాస్యం, యాక్షన్ రెండూ కలసి ఉన్న కథానాయకులు రజనీకాంత్, విజయ్ మాత్రమే. ఈ రెండు అంశాలు ఉంటే ఎలాంటి పాత్రలైనా అలవోకగా పోషించవచ్చు. వారిద్దరి తర్వాత అలాంటి నటుడు కార్తి ఒక్కడే అని చెప్పొచ్చు. 'పయ్యా', 'ఆయిరత్తిల్ ఒరువన్', 'సిరుతై'ల్లో ఆయన హావభావాలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. ఇది కూడా అలాంటి విజయాల జాబితాలో చేరుతుందని నమ్ముతున్నా అన్నారు.

ఈ సందర్భంగా 'పౌర్ణమి' చిత్రంలో 'భరతనాట్యమున..' గీతానికి ఓ యువతి చేసిన వినూత్న భరతనాట్యం ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











