ఆంజనేయుడి ఆలయం కట్టిన యాక్షన్ స్టార్
యాక్షన్ కింగ్ ఇమేజ్ తెచ్చుకున్న అర్జున్ మొదటి నుంచి ఆంజనేయ స్వామికి ప్రియ భక్తుడు. ఆ అభిమానంతోనే ఆయన తాజాగా పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామి విగ్రహంతో కూడిన గుడిని కట్టించి ప్రారంభించారు. ముప్పై ఐదు అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం మొత్తం ఒకే రాతితో చెక్కబడింది. ప్రపంచంలో పద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ విగ్రహం ఇదే అంటున్నారు. ఇక ఈ దేవాలయాన్ని సిరిపెరంబుదూర్ దగ్గరలోని గేరుంబాకమ్ గ్రామంలో నిర్మించారు. ఈ దేవాలయం నిర్మించటానికి సంవత్సర కాలం పట్టింది. కుంభాభిషేకం తో ఈ విగ్రహానికి పూజలు చేసి ప్రారంభించారు.
ఈ విగ్రహాన్ని కర్ణాటకటలోని హుబ్లీలో నిపుణుల సమక్షంలో తయారుచేయించారు. ఇక విగ్రహం తయారుచేయటానికి కావల్సిన రాయి కోసం చాలా ప్రాంతాలు తిరిగి ఎంపిక చేసారు. కర్ణాటక నుంచి చెన్నై ఈ విగ్రహాన్ని తీసుకురావటానికి ప్రత్యేకంగా 160 చక్రాల ట్రక్ తయారు చేయించారు. గతంలోనూ రాఘవ లారెన్స్ కూడా మొన్నీ మధ్య రాఘవేంద్రస్వామి గుడి కట్టించిన సంగతి తెలిసిందే.
గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన శ్రీ ఆంజనేయం చిత్రంలో అర్జున్ ..ఆంజనేయ స్వామిగా కనిపించారు. నితిన్,ఛార్మి కాంబినేషన్ లో రూపొందిన ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. భక్తి కన్నా ముక్తి ఎక్కువైందని కామెంట్స్ రావటంతో ఆ చిత్రానికి ఆదరణ దక్కలేదు. అయితే అర్జున్ పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం అర్జున్ కన్నడ చిత్ర పరిశ్రమలో బిజీ అవుతున్నారు. దాదాపు 11 ఏళ్ళ విరామం తర్వాత 'ప్రసాద్' చిత్రం ద్వారా కన్నడ ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రానికి బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఒక కన్నడ సినిమా త్వరలో విడుదల కానుంది. మరోపక్క 'వీరప్పన్' అనే సినిమాలో ఒక పోలీస్ అధికారి పాత్ర పోషించనున్నట్లు చెప్పాడు.


Click it and Unblock the Notifications











