శింబుపై హటాత్తుగా కేసు వెనక్కి..ఏం జరిగింది
చెన్నై : సోమవారం విచారణ జరగనున్న నేపథ్యంలో కేసు వేసిన వెంకటేశన్ అనే వ్యక్తి హఠాత్తుగా తన పిటీషన్ను వాపస్ తీసుకున్నారు. పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకే ఆయన కేసును వాపస్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. శింబుపై పాట్టాలీ మక్కల్ కట్చికి చెందిన వెంకటేశన్ అనే వ్యక్తి చెన్నై సైదాపేట కోర్టులో బీప్ సాంగ్ వ్యవహారంలో పిటీషన్ దాఖలు చేసారు.
మహిళలను అవమానించే విధంగా అసభ్య పదజాలాలతో పాట రాసి, పాడారంటూ నటుడు శింబు బీప్ సాంగ్ వివాదం మొదలై అరస్ట్ ల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడులోని పలు మహిళా సంఘాల నిర్వాహకులు మండిపడుతూ ఆందోళనకు దిగారు. మరోప్రక్క శింబుపై కోవై, చెన్నైలో పలు విభాగాల్లో పోలీసులు కేసులు నమోదు చేసి, ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు
మరో ప్రక్క బీప్సాంగ్ను అడ్డుపెట్టుకుని తమ హీరోని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు శింబు ఫ్యాన్స్ అశోశియేషన్స్ ఆరోపిస్తున్నాయి. మరోవైపు పలు సంఘాలు కూడా ఆయనకు మద్దతుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమస్య నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని శింబు తండ్రి టి.రాజేందర్ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శింబు అభిమానులు చెన్నైలో భారీఎత్తున ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం వళ్లువర్కోట్టం వద్ద అభిమాన సంఘం సోమవారం ఉదయం 9 గంటలకు ఆందోళన చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు దిండుక్కల్, తూత్తుకుడి, సేలం, తిరుచ్చి తదితర ప్రాంతాల్లో శింబుకు మద్దతుగా ఆయన అభిమానులు ప్రత్యేక వాల్ పోస్టర్స్ ను కూడా అతికిస్తున్నారు. శింబును ఒంటరిని చేసి కొందరు సమస్యలు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.
"ఓ పాట కోసం నా దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు, ఫొటోలకు చెప్పులమాల వేస్తున్నారు. అంతలా నేనేం తప్పుచేశాను? రేప్ చేసిన వ్యక్తి కూడా బయట హాయిగా తిరుగుతున్నాడు. కానీ నన్ను ప్రత్యేకించి సమస్యల్లోకి నెడుతుండటం నాకు బాధ కలిగిస్తోంది" అంటున్నారు హీరో శింబు. బీప్సాంగ్ విడుదలైన తర్వాత చాలారోజుల అనంతరం నటుడు శింబు దీనిపై ఓ టీవీ ఛానెల్తో మాట్లాడారు.
ఈ పాటను తాను అధికారికంగా విడుదల చేయలేదని, ఎవరో పనిగట్టుకుని నాకు ఈ స్థాయిలో సమస్యలు పుట్టించాలనే ఉద్దేశంతోనే దీన్ని విడుదల చేశారని అన్నారు.
శింబు మాట్లాడుతూ.... ‘నేను పనిగట్టుకుని పబ్లిసిటీ కోసం ఈ పాటను విడుదల చేసినట్లు చెబుతున్న మాటల్లో నిజం లేదు. నాకు అలాంటి పబ్లిసిటీ అక్కర్లేదు. గత 30 సంవత్సరాలుగా ఈ చిత్రపరిశ్రమలో ఉన్నా. చిన్నతనం నుంచి నటిస్తున్నా. తమిళనాడులో ఉన్న అందరికీ శింబు అంటే ఎవరో తెలుసు.

‘మన్మథన్' సినిమా వచ్చినప్పుడు కూడా శింబు అమ్మాయిలకు వ్యతిరేకంగా ఈ సినిమాల్లో నటించాడని ఆందోళన చేశారు. కానీ ఆ సినిమా అమ్మాయిల వల్లే పెద్ద స్థాయిలో హిట్ అయ్యింది. నాకు లేడీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ ఆ పాటలో నేను అమ్మాయిలను కించపరుస్తూ పాడలేదు.
అబ్బాయిలు పొగతాగొద్దు, మద్యం సేవించొద్దు, ఉద్యోగాలు మానుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఓ సందేశంతో దీన్ని రూపొందించా. వాస్తవానికి ఈ పాట విననివారు కూడా నన్ను విమర్శిస్తున్నారు. కానీ నేను చట్టపరంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నా. కానీ నా అభిమానులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు అన్నారు.
కోవై రేస్కోర్సు పోలీసులు స్థానిక కమిషనర్ అమల్రాజ్ ఆదేశాల మేరకు చెన్నై నుంచి శింబు, అనిరుద్ల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే ఇంతవరకు శింబు ఎక్కడున్నాడో ఆచూకి దొరకలేదు. అదే విధంగా అనిరుద్ కెనడా నుంచి చెన్నైకు తిరిగి రాలేదు.


Click it and Unblock the Notifications











