రియల్ లైఫ్ లో... హీరోయిన్ కు, విలన్ కు ఘనంగా నిశ్చితార్థం
చెన్నై : ఇటీవల 'జిగర్దండా'తో ఉత్తమ నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు కుర్రాడు బాబిసింహా, నటి రేష్మి మేనన్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 'ఇనిదు ఇనిదు' చిత్రం ద్వారా కోలీవుడ్లో అడుగుపెట్టింది రేష్మిమేనన్.
ప్రస్తుతం 'ఉరిమీన్'లో ఈ జంట నటిస్తోంది. చిత్రీకరణ తరుణంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో ఆదివారం ఉదయం వివాహ నిశ్చితార్థం మైలాపూర్లోని లక్స్హౌస్లో జరిగింది. వారి సన్నిహితులు, బంధువులు మాత్రమే పాల్గొన్నారు. దర్శకనటుడు ఎస్జే సూర్య ఈ జంటకు అభినందనలు తెలిపారు.

'పిజ్జా', 'కాదలిల్ సొదప్పువదు ఎప్పడి', 'సూదుకవ్వుం' వంటి చిత్రాల్లో మూడు భిన్నమైన పాత్రలను పోషించి.. నవరసాలు పండించగలనని నిరూపించారు నటుడు బాబి సింహా. ఆ తర్వాత కార్తిక్ సుబ్బురాజ్ దర్శకత్వంలోని 'జిగర్దండా' సినిమాలో విలన్గా, హాస్య నటుడిగా చిత్రమైన పాత్రపోషించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు. దీంతో ఆయనకు అవకాశాలు భారీగా వెతుక్కుంటూ వస్తున్నాయి.
శంకర్ శిష్యుడు ఆడామ్ చెప్పిన కథ బాబిసింహాకు నచ్చడంతో సోలో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నారు. తొలిసారిగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి 'పాంబుసట్త్టె' అని పేరుపెట్టారు. అజీస్ అశోక్ సంగీతం సమకూర్చుతున్నారు. వైరముత్తు, మదన్కార్కి, వివేకా పాటలు రాశారు. రాధికా శరత్కుమార్, లిస్టిన్ స్టీఫన్ సంయుక్తంగా నిర్మించారు.

చిత్ర విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవర్నీ నమ్మేందుకు లేదు. ఎవరి జీవితం వాళ్లకు ముఖ్యమైపోయింది. పాము కుబుశం విడిచినట్లుగా.. మనుషులు డబ్బులు, స్వార్థం కోసం ఎప్పటికప్పుడు తమ రూపును మార్చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి ఆరంభం, అంతానికి సంబంధించిన కథే ఈసినిమా. కానీ మనిషికి ప్రేమ, ఆదరాభిమానం, మానవత్వం చాలా ముఖ్యమని చాటిచెప్పేలా చిన్న ప్రయత్నం చేశామన్నారు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











