అతిరథ మహారధుల మధ్య 'దశావతారం' ఆడియో సీడీని జాకీచాన్ చేతుల మీదుగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి అందించారు. దాదాపు 50 కోట్ల భారీ బడ్జెట్తో ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించగా, కమల్ హీరోగా నటిస్తున్న 'దశావతారం' ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిగ్ బీ అమితాబ్బచ్చన్, మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి, తమిళ యువ నటుడు విజయ్, నాటి బాలీవుడ్ డ్రీమ్గర్ల్ హేమమాలిని, నటి జయప్రద, చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్, ఆస్కార్ రవిచంద్రన్ సోదరుడు శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాకీచాన్ మాట్లాడుతూ- 'భవిష్యత్తులో కమల్హాసన్, అమితాబ్బచ్చన్లతో కలిసి నటిస్తానన్నారు. దీని కోసం ఇండియాకు వస్తానని చెప్పారు. 'ది మిత్" చిత్రంలో తనతో కలిసి నటించిన బాలీవుడ్ నటీమణి మల్లికా షెరావత్ తనకు మంచి స్నేహితురాలు, సోదరిలాంటిదని జాకీచాన్ పేర్కొన్నారు. 54 నాలుగేళ్ల వయస్సులో కూడా తన ఫిట్నెస్కు అసలు కారణం ఏమంటే తాను ఏనాడూ అశ్రద్ధ చేయకుంటా క్రమం తప్పకుండా చేసే శరీర వ్యాయామమే' అని బదులిచ్చారు. అరుదైన పాత్రలు పోషించే కమల్హాసన్ ఇప్పుడు దశావతారంతో అద్భుతాలు సృష్టిస్తారని ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. అమితాబ్బచ్చన్ మాట్లాడుతూ - 'దశావతారం'లోని కొన్ని క్లిప్పింగులను చూసి తనకే ఈర్ష కలిగిందని, ఇలాంటి సినిమాల్ని తానెందుకు చేయలేకపోయానన్న బాధ కలిగిందని' అన్నారు. తాను నటుడినైనా తన అభిమాన నటుడు మాత్రం కమల్హాసనేనని మమ్ముట్టి అన్నారు.