గౌతమ్ మీనన్ పై నిర్మాత కేసు..వివాదం
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతుండటంతో, సాధారణంగా ఎక్కువగా మాట్లాడని మీనన్ బహిరంగ లేఖతో సినీ వర్గాల ముందుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన సినీ వర్గాలు ఐక్యంగా వచ్చి తనకు సాయపడాలని కోరారు. ఈ పోరాటాన్ని తాను ఒంటరిగా ఎదుర్కోలేనని పేర్కొన్నారు. 'చిత్రం అంచనాల మేరకు విజయం సాధించకపోతే నిర్మాతలు కేసులు పెడుతారు జాగ్రత్తగా ఉండండి' అంటూ ఆయన తన సహసినీదర్శకులకు సూచించారు.
'తమిళంలో 'నీథానే ఎన్ పోన్వసంతం' (తెలుగులో 'ఎటో వెళ్ళిపోయింది మనసు') చిత్రాన్ని తాను చాలా ఇష్టంగా నిర్మించానని, అయినా ఆ చిత్రం సరిగ్గా ఆడలేదని, ఆ నెపంతో నిర్మాత తనకు లీగల్ నోటీసులు పంపటం సరికాద'ని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో పరిశ్రమ తనకు అండగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బుని తిరిగి ఇవ్వాలని నిర్మాత తనని డిమాండ్ చేశారని ఆయన తెలిపారు.
అలాగే ఇక మీదట తాను చిత్రాలు తియ్యకుండా నిరోధించేలా ఆర్డర్ సంపాదించేందుకు కుమార్ ప్రయత్నించగా ఆ కేసును కోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఆ తర్వాత ఎల్రెడ్ మరో కేసు ఫైలు చేశారని, అందులో దాదాపు 9.5 కోట్ల రూపాయలతో పాటు తన ఇంటిని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం పరాజయం కంటే ముందు నుంచే ఆ నిర్మాతతో చాలా సమస్యలున్నాయని ఆయన తెలిపారు. చిత్ర నిర్మాణ సమయంలో హీరో ఎంపిక నుంచి సంగీత దర్శకుని వరకు, బడ్జెట్ మొదలుకొని ప్రతి విషయం సమస్యగానే సాగిందని అన్నారు.


Click it and Unblock the Notifications












