‘విశ్వరూపం’ నిషేదమే లక్ష్యంగా జయ ప్రభుత్వం పైకోర్టుకి
చెన్నై: 'విశ్వరూపం' చిత్రంపై మద్రాస్ హైకోర్టు నిషేదం ఎత్తి వేసిన ఆనందంలో ఉన్న కమల్కు జయలలిత ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆ సినిమాపై నిషేదం ఎత్తి వేయడాన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఆ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒక వేళ జయలలిత ప్రభుత్వానికి మరోసారి ఇక్కడ చుక్కెదురైనా....సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సైతం తమిళనాడు ప్రభుత్వం వెనకాడటం లేదని చెన్నై టాక్. పరిస్థితి చూస్తుంటే 'విశ్వరూపం' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో విడుదల కాకుండా జయ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. బ్యాన్ కారణంగా ఈ చిత్రం ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్ట పోయింది.
మరో వైపు.... 'విశ్వరూపం' చిత్రం ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ లో నిలిపి వేయాలని కోరుతూ నగరానికి చెందిన బిజినెస్ మేన్ మహ్మద్ హజి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసారు. ఈ చిత్రం ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండటంతో పాటు, సామాజిక సామరస్యం దెబ్బతీసేలా ఉందని తన పిటీషన్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











