ఏ మతానికీ వ్యతిరేకం కాదంటూ కమల్హాసన్ వివరణ
విశ్వనటుడు కమల్హాసన్ స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం 'విశ్వరూపం'. 'ఆరో త్రీడీ' సాంకేతికతతో రూపొందించడం విశేషం. ప్రపంచంలోనే ఈ తరహా పరిజ్ఞానంతో వస్తున్న రెండో సినిమా ఇది. ఇదిలా ఉండగా బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆడియో విడుదల జరపాలనుకోగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఈ నేపథ్యంలో అభిమానులను నిరాశపరచకూడదనే ఉద్దేశంతో ఆరో 3డీతో రూపొందించిన ట్రైలర్ను కమల్ బుధవారం విడుదల చేశారు. కార్యక్రమానికి నగరంలోని సత్యం థియేటర్ వేదికైంది.
ఈ రోజు నా పుట్టినరోజు. మదురై, చెన్నై, కోవై నగరాల్లో హెలికాప్టర్లో వెళ్లి ఆడియోను విడుదల చేసి సంక్షేమ పథకాలను పంపిణీ చేయాలని భావించా. వాతావరణం అనుకూలించని కారణంగా ప్రయాణాన్ని రద్దు చేశా. అభిమానుల కోసం ఈ ట్రైలర్ను విడుదల చేస్తున్నా. విశ్వరూపం చిత్రానికి 'యు/ఏ' సర్టిఫికేట్ లభించింది. సినిమాను ఏ మతానికీ, ఏ దేశానికి వ్యతిరేకంగా చిత్రీకరించలేదు. హాలీవుడ్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించుకున్నా. మొత్తం 3 వేల ప్రింట్లల్లో జనం ముందుకు రానుంది. అందుకే పనులు మరింత పెరుగుతున్నాయి. ఆసియాలోనే తొలిసారిగా ఆరో త్రీడీ టెక్నాలజీతో తీసుకొస్తున్నాం. ఈ సాంకేతికతను రాష్ట్రంలోని 30 థియేటర్లలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.
పుట్టినరోజు సందర్భంగా కమల్హాసన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కమల్ బుధవారం ఉదయం సచివాలయంలో ముఖ్యమంత్రి జయలలితను కలుసుకుని శుభాకాంక్షలు అందుకున్నారు. పలువురు నటీనటులు కూడా ప్రకటనలు విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలచందర్ మాట్లాడుతూ... మారుతున్న కాలానికి తగ్గట్టు.. అత్యాధునిక సినీ ప్రపంచంలోని సాంకేతిక హంగులను ఎప్పటికప్పుడు తెలుసుకునే సత్తా కమల్కు ఉంది. తమిళ పరిశ్రమలో అతిపెద్ద స్థానం సంపాదించుకున్నారు. త్వరలో హాలీవుడ్లోనూ ప్రతిభ చాటుకుంటారు అన్నారు.


Click it and Unblock the Notifications












