డబ్బు కోసం మాత్రమే చేయను : ఇళయరాజా
చెన్నై : డబ్బు కోసమే తాను సంగీతాన్ని అందించట్లేదని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. తాను సంగీతం అందించిన 'ఒరు వూరులే' చిత్ర ఆడియో సీడీలను దర్శకుడు బాలూ మహేంద్రతో కలిసి ఆయన ఆవిష్కరించారు. శనివారం నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇళయరాజా మాట్లాడారు.
ఇళయరాజా మాట్లాడుతూ..... 'ఒరు వూరులే' చిత్రాన్ని పూర్తిగా తిలకించాకే సంగీతం అందించేందుకు అంగీకరించానని అన్నారు. ఏ చిత్రానికి కూడా తాను మూడు రోజులకు మించి సంగీతం అందించింది లేదని, అది వందరోజుల చిత్రమైనా, వజ్రోత్సవ చిత్రమైనా తన పంథా ఒకటేనన్నారు.

కొత్త దర్శకుల చిత్రాలకు సంగీతం అందించటం పట్ల తానెప్పుడూ వెనకాడలేదని, అయితే అలాంటి దర్శకుల చిత్రాలకు సంగీతం అందించవద్దంటూ పలువురు తన వద్ద ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. తానెప్పుడూ డబ్బు కోసం మాత్రమే సంగీతం అందించలేదని, అలా డబ్బు కోసం తాను ఆశపడి ఉంటే స్వచ్ఛమైన సంగీతం తననుంచి ఎప్పుడో దూరమై ఉండేదన్నారు.
కొత్త దర్శకుల చిత్రాలకు సంగీతం అందించేందుకు కూడా తానెప్పుడూ సిద్ధంగా ఉన్నానని, వారు తనను నమ్ముకుని ముందుకు రావొచ్చన్నారు. వసంతకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకటేష్-నేహాపటేల్ జంటగా నటించారు.


Click it and Unblock the Notifications











