ఇళయరాజా స్వరపరిచిన సినీ శతాబ్ధి గీతం
చెన్నై: వందేళ్ల సినిమా సంబరాల కోసం సంగీత జ్ఞాని ఇళయరాజా నేతృత్వంలో సినీ శతాబ్ధి గీతాన్ని రూపొందించారు. అన్ని భాషలను మిళితం చేస్తూ రూపొందించిన ఈ గీతం వందేళ్ల వేడుకల్లో ప్రధాన హైలెట్గా భావిస్తున్నారు. అలాగే దక్షి ణాదిలోని ప్రతి భాషకు ప్రత్యేకంగా ఒక గీతాన్ని తీర్చిదిద్దారు. తొలి రోజున సినీ శతాబ్ధి గీతాన్ని, ఆయా భాషల సంబరాల్లో భాగంగా ఆయా భాషల గీతాలు ప్రారంభిస్తారు.
వందేళ్ల సినీ చరిత్రలో దక్షిణాది సినీరంగం పాత్ర అత్యంత కీలకం. శతాబ్దకాలంలో తాము నిర్వర్తించిన ఈ కీలకపాత్రను ప్రపంచానికి చాటేలా సినీ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు నాలుగు రాష్ట్రాల చిత్రపరిశ్రమలు సిద్ధమయ్యాయి. రూ.30 కోట్లతో దక్షిణ భారత ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, తమిళనాడు ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో వందేళ్ల సినీ వేడుకలు శనివారం ప్రారంభం కానున్నాయి. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవనున్న వేడుకలను తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని ప్రారంభించనున్నారు. ఆ రోజున తమిళ సినీ పరిశ్రమకు చెందిన 50 మంది సినీ ప్రముఖులను జయలలిత సన్మానించనున్నారు.

ఆదివారం ఉదయం కన్నడ సినీ పరిశ్రమ వేడుకలు జరుగనుండగా తెలుగు చిత్రసీమ వేడుకలు సాయంత్రం మొదలవనున్నాయి. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖమంత్రి డీకే అరుణ, కేంద్రమంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో పాటు 650 మంది సినీరంగ ప్రముఖులు హాజరవుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆదివారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 50 మంది ప్రముఖులు సన్మానం అందుకోనున్నారు.
23న మలయాళ చిత్రసీమ వేడుకలు, 24న ముగింపు కార్యక్రమం ఉంటుంది. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్య అతిథిగా హాజరై తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం పరిశ్రమల నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 28 మందిని సన్మానించనున్నారు. ఇందుకు సంబంధించి తుది జాబితా సిద్ధమైంది. తెలుగు సినీ పరిశ్రమలో సన్మానం పొందనున్న ఏడుగురి వివరాలను సభావేదికపై మాత్రమే ప్రకటిస్తామని ఛాంబర్ అధ్యక్షుడు సి.కళ్యాణ్ తెలిపారు.
నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ వేడుకల్లో దక్షిణాది భాషలకు చెందిన సినీ కళాకారులందరూ పాల్గొననున్నారు. తమిళనాడు ప్రభుత్వంతో కలిసి దక్షిణ భారత చలనచిత్ర వాణి జ్య మండలి (ఛాంబర్) రూ.30కోట్లతో శతాబ్ధి వేడుకలను జరుపుతోంది. వేదిక కోసమే రూ.8 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వేడుకల్లో తొలి రోజున తమిళ సినిమా సంబరాలు జరుపుకుంటుంది. తమిళ సినిమాలోని దిగ్గజాలను ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా సన్మానిస్తారు. వేడుకల వన్నె తెచ్చేందుకు సినీ తారల ఆటపాటలు ఉంటాయి. పెద్ద సంఖ్యలో అందాలతారలు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రెండోరోజు ఉదయం 9 గంటలకు కన్నడ సినిమా సంబరాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కర్ణాటక మంత్రులు కేజే జార్జ్, రామలింగరెడ్డి, ఉమశ్రీ అతిథులుగా విచ్చేయనున్నారు.
కర్ణాటక సినిమా దిగ్గజాలను ఈ సందర్భంగా సన్మానిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలుగు సినిమా సంబరాలు ప్రారంభమవుతాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి డి.కె. అరుణ తెలుగు పరిశ్రమ తరపున అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కినేని నాగేశ్వరరావు, ఇతర దిగ్గజాలను సన్మానిస్తారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు మలయాళ పరిశ్రమ సంబరాలు జరుగుతాయి. కేంద్ర ప్రవాస భారతీయుల వ్యవహారాలశాఖ మంత్రి వయలార్ రవి, కేరళ గ్రామీణాభివృద్ధి మంత్రి కేసీ జోసఫ్ అతిథులుగా పాల్గొంటారు.
శతాబ్ధి వేడుకల్లో ఆఖరి రోజున సినీ, రాజకీయరంగాలకు చెందిన అతిరథమహారథులు హాజరుకానున్నారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ దిగ్గజాల సమక్షంలో సాయంత్రం 5 గంటలకు ముగింపు వేడుకులు ప్రారంభమవుతాయి. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, కేరళ కేరళ ముఖ్యమంత్రి ఒమన్ చాండీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకే వేదికపై ఆశీనులు కానున్నారు.
సందిగ్ధంలోనే
సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో వేడుకలను వాయిదా వేయాలని కొందరు, సాంస్కృతిక ప్రదర్శనలకు దూరంగా ఉంటామని మరికొందరు తె లుగు తారలు ప్రకటించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులు గందరగోళానికి గురవుతున్నారు. శతాబ్ధి వేడుకల్లో తెలుగు సినిమా వెలుగులు పంచుతుందో లేక సన్మానాలకే పరిమితమవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. తెలుగు పరిశ్రమ తరపున తారలు తప్పకుండా సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంటారని ఛాంబర్ పదేపదే చెబుతున్నప్పటికీ, తెలుగు తారలు రిహార్సల్స్లో పాల్గొంటున్న దాఖలాలు కనిపించడం లేదు.
దక్షిణాది తారలందరితోపాటూ మంత్రులు కూడా పాల్గొననుండడంతో శతాబ్ధి వేడుకలకు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. భద్రత కారణాల దృష్ట్యా వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టాన్ని అభిమానులకు దూరం చేశారు. సిని పరిశ్రమకి చెందిన కళాకారులు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.


Click it and Unblock the Notifications











