ఇది సాంస్కృతిక ఉగ్రవాదం: విశ్వరూపం నిషేదంపై కమల్
చెన్నై : 'విశ్వరూపం' చిత్రంపై తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించడంపై ఆ చిత్ర నిర్మాత, దర్శకుడు, నటుడు కమల్ హాసన్ తీవ్రంగా స్పందించారు. తన చిత్రంపై నిషేదం విధించడం అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇలా చేయడాన్ని సాంస్కృతిక ఉగ్రవాదంగా అభివర్ణించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడటం సమంజసం కాదని, తమిళనాడు ప్రభుత్వంపై తాను న్యాయ పోరాటానికి దిగనున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు.
మతాలకు అతీతంగా సోదర భావంతో జీవించే భారత దేశ వాసిని నేను....అలాంటి నేను ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాను ఎందుకు తీస్తాను? నా సినిమాలో ముస్లింల మనో భావాలు దెబ్బ తీసే విధంగా ఎలాంటి సన్ని వేశాలు లేవని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు. తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం విశ్వరూపం. ఈ చిత్రాన్ని చంద్రహాసన్, కమల్ హాసన్ సంయుక్తంగా నిర్మించారు. హీరోయిన్లుగా పూజా కుమార్, ఆండ్రియా నటిస్తుండగా, రాహుల్ బోస్, జైదీప్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 95 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈనెల 25న సినిమా విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు.
తమిళనాడులో ముస్లిం సంఘాల ఆందోళన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ సినిమాపై 15 రోజుల నిషేదం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాపై కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఏ సీన్లు కట్ చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. అయితే తెలుగు నాటు నిషేదం లేక పోయినా....విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.


Click it and Unblock the Notifications











