పెళ్లైన 4 నెలలకే సంతానమా? నయనతారకు షాకిచ్చిన తమిళ సర్కార్.. విచారణకు ఆదేశం!
దక్షిణాదిలో టాప్ హీరోయిన్ నయనతార, టాప్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు అక్టోబర్ 9వ తేదీన పండంటి కవలలకు సరోగసి ద్వారా జన్మనిచ్చామని అభిమానులకు శుభవార్తను అందించారు. దాంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలతో వెల్లువెత్తించారు. అయితే తల్లిదండ్రులం అయ్యామనే ఆనందం వెంటనే ఆవిరైపోయింది. అయితే నిబంధనలకు అనుగుణంగానే సరోగ్రసి ద్వారా పిల్లలు కన్నారా అని నయనతార దంపతులకు తమిళనాడు సర్కారు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం వివరాల్లోకి వెళితే..

జూన్ 9వ తేదీన వివాహం
నయనతార, విఘ్నేష్ శివన్ రిలేషన్షిప్ విషయానికి వస్తే.. చాలా ఏళ్లుగా వారిద్దరూ సహజీవనం చేశారు. పెళ్లికి ముందు వారు చేసిన విహారయాత్రలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అనేక రూమర్లు, గాసిప్స్ మధ్య చెన్నైకి సమీపంలోని మహబలిపురంలోని ప్రముఖ హోటల్లో జూన్ 9వ తేదీన నయన్, విఘ్నేష్ పెళ్లి చేసుకొన్నారు.

అక్టోబర్ 9వ తేదీన కవలపిల్లలకు జన్మ
అయితే తాజాగా అక్టోబర్ 9వ తేదీన నయన్ తార, విఘ్నేష్ సోషల్ మీడియాలో తమకు కవల పిల్లలు జన్మించారంటూ తమ సన్నిహితులకు, అభిమానులకు వార్తను షేర్ చేశారు. విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు పెట్టి.. నయన్ నేను అమ్మా, నాన్నలమయ్యాం. మాకు ఇద్దరు మగ కవలపిల్లలు జన్మించారు. మా పూర్వీకులు, కుటుంబ సభ్యుల దీవెనలతో కవల పిల్లలు జన్మించారు. దాంతో మా బంధం, మేమిద్దరం మరింత దగ్గరయ్యాం. మా పిల్లలకు ఉయిర్, ఉలగమ్ అని నామకరణం చేశాం అని విఘ్నేష్ శివన్ పోస్టులో పేర్కొన్నారు.

సరోగసి విధానాన్ని ప్రశ్నించిన తమిళ ఆరోగ్య మంత్రి
అయితే సరోగ్రసి ద్వారా కవలల పిల్లలకు జన్మినిచ్చిన నయనతార దంపతులు నిబంధనలు పాటించారా? అనే విషయాన్ని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణ్యం ప్రశ్నించారు. సరోగసి ద్వారా పిల్లల్ని కనడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను తల్లిగా నయనతార పాటించారా అనే విషయంపై విచారణ, దర్యాప్తు జరిపించాలని మంత్రి ఆదేశించారు.

నిబంధనలు పాటించారా? విచారణకు ఆదేశం
సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కనడానికి తమిళనాడు ప్రభుత్వం 90 నిబంధనలతో కూడిన ప్రమాణాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారం.. సంతానోత్పత్తికి సంబంధించిన కణాలను దానం చేసిన మహిళ 21 నుంచి 36 ఏళ్ల వయసు ఉండాలి. ఆమె తప్పనిసరిగా వివాహిత అయి ఉండాలి. సరోగసి ద్వారా పిల్లల కనాలనే పద్దతిని పాటించే ముందు భర్త నుంచి ఆ మహిళ అనుమతి పొందాలి అనే నిబంధనలను పాటించారా? అని మంత్రి ప్రశ్నించారు.

నయనతారకు పెళ్లైన నాలుగు నెలలకే సంతానం
అయితే నయనతార, విఘ్నేష్ శివన్ దంపతులు వివాహం చేసుకొన్న నాలుగు నెలలకే కవలలకు జన్మనివ్వడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే తమిళనాడు ప్రభుత్వం విధించిన నిబంధనలను వారు పాటించారా? మంత్రి ప్రశ్నలకు నయనతార, విఘ్నేష్ శివన్ సమాధానాలు చెబుతారా? నయనతార ఇద్దరు పిల్లల జన్మతకు చట్టబద్దత ఉందా అనే ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











