రజనీ కాంత్ తో మరిచిపోలోని మొదటి రోజు
చెన్నై : రాధికాఆప్టే ప్రస్తుతం సూపర్స్టార్ రజనీకాంత్ సరసన 'కబాలి'లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రెండు నెలల కిందట చెన్నైలోని విమానాశ్రయంలో ఆరంభమై మలేషియాలో సాగింది. దాదాపు నెల రోజుల పాటు అక్కడ నిరంతరాయంగా షూటింగ్ జరిపారు దర్శకుడు రంజిత్.
ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ గోవాలో ప్రారంభమైంది. అక్కడ రజనీకాంత్, రాధికఆప్టేకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. తొలిరోజు షూటింగ్ టైమ్ లో రాధిక సూపర్స్టార్ ఎదుట నటించేందుకు కాస్త ఆందోళన చెందినట్లు చిత్రయూనిట్ చెబుతోంది. ఎక్కువ టేకులు కూడా తీసుకుందట.
దీన్ని గుర్తించిన రజనీకాంత్ ఆమెను పిలిచి.. మీరు నటించిన సినిమాలన్నీ చూశా. చాలా అద్భుతమైన నటి మీరు. మీలాంటి నటితో నటించేందుకు నేను భయపడాలి. పంచ్డైలాగులు, ఫైట్లు.. ఇవన్నీ సులభమే. కానీ ఆవేదన, బాధాకర సన్నివేశాల్లో నటించడమే చాలా ఇబ్బంది. ఆ విషయంలో మీరు ఆరితేరిన నటి..' అంటూ ఆమెను సహజస్థితిని తీసుకొచ్చినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత నుంచి రాధికాఆప్టే ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సన్నివేశాల్లోనూ నటిస్తోందట.

దీనిగురించి ఆమె ముచ్చటిస్తూ.. తొలిరోజు చిత్రీకరణ కోసం ఎప్పటినుంచో ఎదురుచూశా. కానీ సెట్లో సూపర్స్టార్ను చూడగానే వణుకు పుట్టింది. నటించడం కూడా కష్టంగా అనిపించింది. కానీ ఆ తర్వాత సాధారణస్థితికి వచ్చి నటించా. సూపర్స్టార్తో తొలిరోజు చిత్రీకరణను, కాస్త భయం, ఉత్సాహాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. మరో 15 రోజుల పాటు ఇక్కడ చిత్రీకరణ కొనసాగే అవకాశముందని సమాచారం.
హిందీ, బెంగాలీ, మరాఠీ, తెలుగు, మలయాళం సహా పలు భాషల చిత్రాల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు అందుకున్న నటి రాధికా ఆప్టే. తెలుగులో బాలకృష్ణ సరసన 'లెజెండ్', 'లయన్' చిత్రాల్లో ఆడిపాడి అందరికీ సుపరిచితురాలైంది.


Click it and Unblock the Notifications











