హిమాలయాలకు రజినీకాంత్..!?: తిరిగి వచ్చాక రాజకీయాలపై తుది నిర్ణయం?
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ త్వరలో హిమాలయాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడట. జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు హిమాలయాలకు వెళ్లడాన్ని అలవాటుగా మార్చుకున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అతి త్వరలో హిమాలయాలకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సన్నాహాలు కూడా చేసుకున్నట్టు సమాచారం 'కాలా' సినిమా షూటింగ్ ముగియగానే హిమాలయాలకు పయనం కానున్నట్లు సమాచారం.

కీలక నిర్ణయాలు తీసుకునేముందు
తన జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకునేముందు కొంతకాలం హిమాలయాల్లో ధ్యానం చేయడం ఆయనకు అలవాటని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని, అందుకే హిమాలయాలకు వెళ్తున్నారని అభిమానుల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అక్కడ ఒక స్థలం కొన్నాడట
కొన్ని రోజు క్రితం ఏకంగా అక్కడ ఒక స్థలం కొన్నాడట. ఈ భూమిలో సాధువలకోసం, హిమాలయాలకు వెళ్ళే యాత్రికుల కోసం ఆశ్రమం కట్టించి వారికి నీడ కల్సించాలన్నదే రజనీకాంత్ ఆశయమని సామచారమ్. ఇటీవలే రజనీకాంత్ పేరు మీద ఈ భూమి రిజిస్ట్రర్ అయ్యింది.

మనసు బాగోలేదట
రజనీకాంత్ ప్రస్తుతం ఓ వైపు శంకర్ తెరకెక్కిస్తోన్న '2.0'లో నటిస్తున్నాడు, మరోవైపు 'కాలా' చిత్రంలోనూ నటిస్తున్నాడు. మరి ఎంచక్కా సినిమాల ప్రమోషన్స్తో రజనీకాంత్ ఊపు మీద ఉండొచ్చు. కానీ రజనీకాంత్ మనసు బాగోలేదట. అందువల్ల ప్రశాంతత కోసం హిమాలయాలకు వెళ్ళి ధ్యానం చేసి మనోబలాన్ని పొందడానికి నిశ్చయించుకున్నాడట.

మనోస్థైర్యం కోసమే
గతంలోనూ రజనీకాంత్ హిమాలయాలకు వెళ్ళి మనోస్థైర్యాన్ని పొంది వచ్చిన సందర్భాలున్నాయని ఆయన అభిమానులు అంటున్నారు. అలాగే ఈ సారి కూడా వెళ్ళి వస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయం. నిజానికి రజనీకాంత్కు ఆందోళన కలిగిస్తున్న అంశం కమల్ హాసన్ రాజకీయప్రవేశం. అంతేనా, రాజకీయాల్లో కమల్ చూపుతోన్న దూకుడు సైతం రజనీ గుండెల్లో గుబులు పుట్టిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

రజనీ ఆందోళనకు అసలు కారణం
కమల్ కంటే ముందే రాజకీయాల్లో ఈ సారి ప్రవేశించి అధికారం చేజిక్కించుకోవాలని తపించాడు రజనీ. ప్రస్తుతం తమిళనాట రాజకీయ శూన్యం చోటుచేసుకుందని, దానిని భర్తీచేసే అవకాశం తమిళ స్టార్స్కే ఉందని ప్రజలు భావిస్తున్నారు. రజనీ అడుగేసే లోపు కమల్ సొంత పార్టీ పెడతానని దూకుడు ప్రదర్శించడంతోనే రజనీ రాజకీయ ఆశలపల్లకి ఊగిసలాడుతోంది. అదే రజనీ ఆందోళనకు అసలు కారణమని తమిళ తంబీలు అంటున్నారు.

అనూహ్యంగా కమల్హాసన్ రాజకీయ ప్రవేశం
రజనీకాంత్కు తమిళనాట ఉన్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆయనతో స్నేహం చేసి తమిళసీమలో పాగా వేయాలనే పథకరచన చేసింది. అయితే అనూహ్యంగా కమల్హాసన్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్ధం చేసుకుంటూ ఉండడం రజనీని కంగుతినిపించింది.

రజనీ కంటే కమల్కే జనాదరణ
అంతేకాక ఇటీవల తమిళనాట నిర్వహించిన ఓ సర్వే ప్రకారం రజనీ కంటే కమల్కే రాజకీయాల్లో ఎక్కువ జనాదరణ ఉన్నట్టు తేలింది. దాంతో రజనీ మరింత కంగారు పడ్డాడు. ఆ ఆందోళన నుండి బయట పడడానికే హిమాలయాలకు వెళ్ళనున్నాడని తెలుస్తోంది. హిమాలయాలకు వెళ్లొచ్చాక రజనీ మళ్ళీ ఊపు మీదుంటాడని అభిమానుల అభిలాష. మరి రజనీ ఏం చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











