ఇంట్రెస్టింగ్: ‘కొచ్చాడయాన్’ పాట పాడిన రజనీకాంత్ భార్య
చెన్నై: సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న 'కొచ్చాడయాన్' చిత్రం ఆడియో విడుదలకు రంగం సిద్ధమైంది. మార్చి 9వ తేదీన జరిగే తమిళ వెర్షన్ కొచ్చాడయాన్ ఆడియో ఆవిష్కరణ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిథిగా విచ్చేయనున్నారు.
తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఆడియో ట్రాక్ లిస్టు కూడా విడుదల చేసారు. ఆడియో ట్రాక్ లిస్టులో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. 'మనపెన్నిన్ సథియమ్' అనే పాటలో రజనీకాంత్ భార్య లత కూడా గొంతు కలిపారు. గతంలో కూడా లత రజనీకాంత్ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు.

తెలుగులో ఈ చిత్రం 'విక్రమసింహా' పేరుతో విడుదల కాబోతోంది. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ తమిళ సినీ పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. రెహమాన్ రేంజికి తగిన విధంగా ఆడియో వేడుక ఫుల్ స్వింగ్లో జరిపేందుకు ప్లాన్ చేసారు. ఈ వేడుకలో ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.
కొచ్చాడయాన్ చిత్రానికి రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. జాకీష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగు, హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించారు. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించింది.


Click it and Unblock the Notifications











