RIP Sujith: జనం గుండె పగిలింది.. దేవుడి హృదయం కనికరించలేదు.. విషాదంలో సినీ ప్రముఖులు
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మూడేండ్ల బాలుడు సుజిత్ విల్సన్ బోరుబావిలో పడి మరణించిన విషాదం దేశవ్యాప్తంగా అందర్ని కదలించింది. అక్టోబర్ 25న బోరుబాడిలో పడిన బాలుడిని నాలుగు రోజులపాటు ప్రభుత్వం యంత్రాంగం రంగంలోకి దిగి చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ప్రధాని మోదీ నుంచి రాహుల్ గాంధీ లాంటి ప్రముఖులు ప్రార్థించినా చిన్నారి ప్రాణాలపై భగవంతుడు కనుకరించలేకపోయాడు. ఈ బాలుడి మరణంపై తమిళ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో భారీగా స్పందించారు.

80 గంటలపాటు బోరుబావిలోనే
సుజిత్ విల్సన్ దాదాపు 80 గంటలపాటు బోరుబావిలో కూరుకుపోయి మృత్యువుతో పోరాడాడు. చివరకు అందులోనే తుదిశ్వాస వదలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. అక్టోబర్ 29వ తేదీన కుళ్లిపోయిన దశలో బాలుడిని బయటకు తీసి అంత్యక్రియలు నిర్వహించారు. సుజిత్ అంత్యక్రియలకు వేలాది మంది హాజరై శ్రద్ధాంజలి ఘటించారు.
ఘటనపై చిన్మయి శ్రీపాద, యాక్టర్ విశాల్ ట్వీట్
సుజిత్ మరణవార్త సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్గా మారింది. కోలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి విషాద సంఘటనలు భవిష్యత్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఈ ఘటనపై చిన్మయి శ్రీపాద, యాక్టర్ విశాల్ తదితరులు స్పందించారు. బేబీ విల్సన్ ఆత్మకు శాంతి చేకూరాలి అని శ్రీపాద ట్వీట్ చేశారు.

విశాల్, ప్రణీత ట్వీట్
అమాయక చిన్నారి సుజిత్ ఆత్మకు శాంతి చేకూరాలి. బాలుడి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం అని విశాల్ ట్వీట్ చేశారు. ఇక హీరోయిన్ ప్రణిత సుభాష్ ట్వీట్ చేస్తూ ప్రపంచం ఇంత టెక్నాలజీతో ముందుకెళ్తున్నా.. బోర్వెల్లో పడిన బాలుడిని కాపాడలేకపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
చైనాలో రక్షించారు.. ఇక్కడేమైందని..
కేబీఆర్ శంతన్ ట్వీట్ చేస్తూ.. సుజిత్ విషాద ఘటన గుండెను పిండి వేసింది. బాలుడి ఆత్మకు శాంతి చేకూరాలి. చైనాలో ఇలాంటి ఘటన జరిగితే 300 ఫీట్లలో పడిన బాలుడిని రక్షించారు. మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం. కానీ ఇలాంటి బాధితులను కాపాడే టెక్నాలజీని కనిపెట్టలేకపోతున్నాం. ఇలాంటి దుర్ఘటనలకు లోను కాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి అని శంతను ట్వీట్ చేశారు.

గౌతమి ఆవేదన
చిన్నారి ఇక మళ్లీ ప్రపంచాన్ని చూడలేదనే బాధతో నా గుండె తరుక్కుపోతున్నది. ఈ దుర్ఘటనకు కారణమైన ప్రతీ ఒక్కరిపై ఆగ్రహం వస్తున్నది. ఇలాంటి విషాదాలు, దుర్ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడం లేదు. మరో చిన్నారి ఇలాంటి ప్రమాదానికి గురికాకుండా చూసుకొందాం అని ప్రముఖ నటి గౌతమి ఆవేదన వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











