సహజత్వం కోసం చెత్తకుప్పల మధ్య షూటింగ్
తిరువళ్ళూరు : సాధారణంగా సినిమా షూటింగ్ అంటే... అందమైన ఉద్యానవనాలు, చరిత్రాత్మక కట్టడాలు, ప్రకృతి అందాల వద్ద ఉంటుంది. కాని 'సాలైయోరం' చిత్రానికి షూటింగ్ స్పాట్లంటే చెత్తకుప్పలే. ఇక్కడ నటీనటుల డ్యాన్స్లు సైతం కొండల్లా కూరుకుపోయిన చెత్తకుప్పలపై దుర్వాసన మధ్య చిత్రీకరిస్తుండటం స్థానికులను నివ్వెరపరుస్తోంది. అసలు ఎలా షూటింగ్ చెయ్యగలుగుతున్నారో అని ఆశ్చర్యపోతున్నారు. ఈ చిత్రంలో పాండ్యరాజన్ విలన్ గా చేస్తున్నారు. అంజాదే తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ఇదే. ఇందులో ఆయన డాన్ గా కనిపించనున్నారు.

పారిశుధ్య కార్మికుల జీవితాలను నేపథ్యంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం 'సాలైయోరం' (రోడ్డు పక్కన). ఈ కార్మికుల జీవనశైలి, రోడ్డుపక్కన చెత్తకుప్పలు, నిల్వలతో కలుగు అనర్థాలపై సమాజానికి అవగాహన కల్పించటమే ఈ చిత్రం ప్రధాన లక్ష్యమని ఈ సినిమా దర్శకుడు మూర్తికన్నన్ పేర్కొంటున్నారు. అందుకే సహజత్వం కోసం చిత్రాన్ని చెత్తకుప్పల్లోనే నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గత 20 రోజులుగా తిరువళ్ళూరు సమీపంలోని అంబత్తూరు అత్తిపట్టు డంపింగ్యార్డు వద్ద జరుపుతున్నారు.
ఇక్కడే నటీనటుల మధ్య ఓ పాట కూడా చిత్రీకరించారు. చిత్రంలో నటించే హీరోయిన్ సెరీనా. ఈమె హైదరాబాదులోని ఉస్మానియ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ విద్యార్థిని. ఈమె వ్యర్థాలు, డంపింగ్యార్డులను తన పరిశోధనాంశంగా తీసుకుని పరిశోధనలను చేస్తోంది. హీరోగా రాజా నటిస్తున్నారు. ఈ చిత్రం పర్యావరణ సమస్యతో పాటు, పారిశుధ్య కార్మికుల జీవితాలకు సంబంధించిన కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది.


Click it and Unblock the Notifications











