రేప్ కన్నా పెద్ద తప్పేం నేను చెయ్యలేదు
చెన్నై : "ఓ పాట కోసం నా దిష్టిబొమ్మను దహనం చేస్తున్నారు, ఫొటోలకు చెప్పులమాల వేస్తున్నారు. అంతలా నేనేం తప్పుచేశాను? రేప్ చేసిన వ్యక్తి కూడా బయట హాయిగా తిరుగుతున్నాడు. కానీ నన్ను ప్రత్యేకించి సమస్యల్లోకి నెడుతుండటం నాకు బాధ కలిగిస్తోంది" అంటున్నారు హీరో శింబు. బీప్సాంగ్ విడుదలైన తర్వాత చాలారోజుల అనంతరం నటుడు శింబు దీనిపై ఓ టీవీ ఛానెల్తో మాట్లాడారు.
ఈ పాటను తాను అధికారికంగా విడుదల చేయలేదని, ఎవరో పనిగట్టుకుని నాకు ఈ స్థాయిలో సమస్యలు పుట్టించాలనే ఉద్దేశంతోనే దీన్ని విడుదల చేశారని అన్నారు.
శింబు మాట్లాడుతూ.... ‘నేను పనిగట్టుకుని పబ్లిసిటీ కోసం ఈ పాటను విడుదల చేసినట్లు చెబుతున్న మాటల్లో నిజం లేదు. నాకు అలాంటి పబ్లిసిటీ అక్కర్లేదు. గత 30 సంవత్సరాలుగా ఈ చిత్రపరిశ్రమలో ఉన్నా. చిన్నతనం నుంచి నటిస్తున్నా. తమిళనాడులో ఉన్న అందరికీ శింబు అంటే ఎవరో తెలుసు.

‘మన్మథన్' సినిమా వచ్చినప్పుడు కూడా శింబు అమ్మాయిలకు వ్యతిరేకంగా ఈ సినిమాల్లో నటించాడని ఆందోళన చేశారు. కానీ ఆ సినిమా అమ్మాయిల వల్లే పెద్ద స్థాయిలో హిట్ అయ్యింది. నాకు లేడీ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికీ ఆ పాటలో నేను అమ్మాయిలను కించపరుస్తూ పాడలేదు.
అబ్బాయిలు పొగతాగొద్దు, మద్యం సేవించొద్దు, ఉద్యోగాలు మానుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఓ సందేశంతో దీన్ని రూపొందించా. వాస్తవానికి ఈ పాట విననివారు కూడా నన్ను విమర్శిస్తున్నారు. కానీ నేను చట్టపరంగా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నా. కానీ నా అభిమానులు నన్ను ఎప్పటికీ ఆదరిస్తారన్న నమ్మకం ఉందని చెప్పారు అన్నారు.
కోవై రేస్కోర్సు పోలీసులు స్థానిక కమిషనర్ అమల్రాజ్ ఆదేశాల మేరకు చెన్నై నుంచి శింబు, అనిరుద్ల కోసం గాలింపు ప్రారంభించారు. అయితే ఇంతవరకు శింబు ఎక్కడున్నాడో ఆచూకి దొరకలేదు. అదే విధంగా అనిరుద్ కెనడా నుంచి చెన్నైకు తిరిగి రాలేదు.


Click it and Unblock the Notifications











