రజనీని కలిసి.. ఫొటో దిగి ఆ డైరక్టర్ ఏమన్నాడో తెలుసా
ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ రీసెంట్ గా రజనీతో కలిసి దిగిన ఫొటో ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఇది ఆస్కార్ అవార్డు విలువతో సమానం అని పేర్కొన్నారు.
చెన్నై: సూపర్స్టార్ రజనీకాంత్ను కలవడం..అనేది చాలా అభిమానుల కల. అయితే ఆ అభిమానుల్లో సినీ సెలబ్రెటీలు సైతం ఉండటం విశేషం. తాజాగా రజనీకాంత్ ని కలవటం తనకు ఆస్కార్ అవార్డుతో సమానమని ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ అభిప్రాయపడుతూ ఆ విషయం ట్వీట్ చేసారు.
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న '2.0' చిత్ర షూటింగ్ ప్రస్తుతం చెన్నై శివార్లలోని ఈవీపీ మాల్ వద్ద ఏర్పాటు చేసిన సెట్లో జరుగుతోంది. ఇదే ప్రాంతంలో సూర్య హీరోగా విఘ్నేశ్ తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే రజనీ అభిమానైన విఘ్నేశ్ పక్కన సెట్లో ఉన్న ఆయన్ను కలవడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా రజనీతో కలిసి దిగిన ఫొటో ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ఇది ఆస్కార్ అవార్డు విలువతో సమానం అని పేర్కొన్నారు. జీవితంలో ఈ అవకాశం ఒక్కసారి వస్తుందని హ్యాష్ట్యాగ్ను జత చేశారు.
ఇంతకీ విఘ్నేశ్ శివన్ ఎవరో గుర్తు వచ్చారా..ఆయన మరెవరో కాదు నయన్ తో ప్రస్తుతం ప్రేమయాణం నడుపుతున్న ప్రియుడు. పలు కార్యక్రమాలకు ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆ మధ్యన జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవంలో కూడా సందడి చేశారు. పురస్కారం అందుకున్న నయనతార.. ఈ అవార్డును విఘ్నేశ్ చేతుల మీదుగా తీసుకోవాలని కోరింది.
ఇటీవల రహస్యంగా వివాహం చేసుకున్నారని వీరికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం లేదని విఘ్నేశ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నయనతార 'డోరా' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఓ పాటను విఘ్నేశ్ శివన్ రాశారు. ఆ సినిమా విడుదల రోజున వారు ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
అన్ని అనుకున్నట్లు జరిగితే నయనతార - విఘ్నేశ్ శివన్ పెళ్లి జరుగునుందని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం నయనతార పలు సినిమాలతో బిజీగా ఉన్నది. అవి పూర్తయ్యే వరకు పెళ్లి విషయాన్నీ వాయిదా వేసుకుంటూ వస్తోంది. మరి ఈ సారైనా ఈ పెళ్ళి జరుగుతుందో లేదో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











