తిప్పించుకుని నో చెప్పాడు...యువ దర్శకుడు గోల
చెన్నై : పెద్ద హీరోల డేట్స్ కోసం దర్శకులు తిరుగతూంటారు. అయితే రోజులు తరబడి తిప్పించుకుని తర్వాత నో చెప్పితే మాత్రం బాధ కలుగుతుంది. ఇప్పుడు అదే పరిస్ధితి యువ దర్శకుడు అట్లీకి ఎదురైంది అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరో విజయ్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రాజెక్టు ఓకే అయిపోతుంది...ఇంక ప్రకటన రావటమే తరువాయి అనుకున్న టైమ్ లో హ్యాండ్ ఇచ్చాడని తెలుస్తోంది.
అభిమానులతోపాటు సినీ పరిశ్రమలోనూ ఆసక్తి రేకిత్తించిన కాంబినేషన్ విజయ్ - అట్లీ. వీరు ఓ సినిమా చేయడానికి గతంలో సిద్ధమయ్యారు. ఇప్పుడీ ప్రాజెక్టుపై ముందుకు సాగడంపై సందిగ్ధత నెలకొంది. గత ఏడాది విజయవంతమైన చిత్రాల్లో 'రాజారాణి' ఒకటి. ఆర్య, నయనతార, జై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగానూ దుమ్ము రేపి రూ.50కోట్లకు పైగా రాబట్టింది. కొత్త దర్శకుడు అట్లీ దీన్ని తెరకెక్కించారు. ఆయన తన రెండో ప్రయత్నంగా విజయ్తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వార్తలొచ్చాయి.

ఓ కథ విజయ్కు చెప్పారని, 'రాజారాణి' తెరకెక్కించిన విధానానికి ముగ్ధుడైన విజయ్ కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు హల్చల్ చేశాయి. అనంతరం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'కత్తి' చిత్రీకరణలో బిజీ అయిన విజయ్... శింబుదేవన్ దర్శకత్వంలో నటించేందుకు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్పైకి చేరనుంది.
తనతో 'నినైత్తేన్ వందాయ్', 'ప్రియముడన్', 'వశీగరా' చిత్రాలను రూపొందించిన సెల్వభారతి చెప్పిన కథకు కూడా విజయ్ ఓకే చెప్పినట్లు తెలిసింది. శింబుదేవన్ చిత్రం తర్వాత నటించయోయే చిత్రం ఇదేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో అట్లీతో విజయ్ సినిమా చేయడంపై స్పష్టత రాలేదు. ఈ కాంబినేషన్లో సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.


Click it and Unblock the Notifications











