హీరో ఇంటిని ముట్టడిస్తాం... రిలీజ్ ఆపాలి
చెన్నై : ప్రముఖ సినీనటుడు విజయ్ నటించిన 'కత్తి' సినిమాకు సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. ఈ సినిమా ప్రదర్శించడాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ పురట్చిభారతం పార్టీ వర్గీయులు బుధవారం ఆందోళన నిర్వహించారు. నగరంలోని నుంగంబాక్కంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పూవై జగన్మూర్తి అధ్యక్షత వహించారు.
జగన్మూర్తి మాట్లాడుతూ ...శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మద్దతుదారులు నిర్మిస్తున్నట్లుగా పేర్కొంటున్న 'కత్తి' చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు చేపట్టని పక్షంలో తాము రంగంలోకి దిగి చిత్ర హీరో విజయ్, చిత్ర దర్శకుడు మురుగదాస్ ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా 'పులిప్పావై' చిత్రంలోనూ ఎల్టీటీఇ ప్రభాకరన్ కుమారుడు బాలచంద్రన్ను కూడా తీవ్రవాది రూపంలో చిత్రీకరించారని ఆరోపించారు. ఈ చిత్ర ప్రదర్శనను కూడా అడ్డుకోవాలని కోరారు.
కాగా గతంలోనూ విజయ్ నటించిన 'తలైవా' చిత్రాన్ని కూడా కొన్ని తమిళ సంఘాల వ్యతిరేకించిన విషయం తెలిసిందే. కత్తి చిత్రంలో విజయ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. లికా ప్రొడక్షన్స్ బ్యానరుపై కరుణామూర్తి, సుభాష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

'తుప్పాక్కి' తర్వాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. ముంబయి, హైదరాబాద్, చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. వడపళనిలోని పుష్పాగార్డెన్లో పెద్ద సెట్ వేసి 40 రోజుల పాటు చిత్రీకరించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్కి ఉన్న మాస్ ఇమేజ్కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.


Click it and Unblock the Notifications











