మొత్తానికి కమల్ 'విశ్వరూపం' ...
చెన్నై : మొత్తానికి కమల్ 'విశ్వరూపం' యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఎన్నో విమర్శలు, విడుదలకు అడ్డంకులు, కమల్ కంటతడి.. ఇలా సంచలనాలకు కేంద్రబిందువుగా మారి ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'విశ్వరూపం'. ఇప్పుడు విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది కూడా. కమల్హాసన్ స్వీయ దర్శకత్వంలో ఆయన హీరోగా తెరకెక్కిందీ చిత్రం.
తాలిబాన్ల కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో దీన్ని తెరకెక్కించిన కమల్హాసన్ విడుదల చేసేందుకు మాత్రం చాలా సమస్యలే ఎదుర్కొన్నారు. కొన్ని రోజుల ఉత్కంఠ తర్వాత ఫిబ్రవరి 7న తెరపైకి వచ్చింది. తొలి ఆట నుంచి ప్రేక్షకుల విశేష ఆదరణను చూరగొంది. కమల్హాసన్ కష్టాలకు ఉపశమనం ఇచ్చింది. ఎవరూ వూహించని విధంగా రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. నేటికీ చెన్నైలోని అన్ని ముఖ్యమైన థియేటర్లలో ప్రదర్శితమవుతూ విజయవంతంగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. తమ ఆరాధ్య నటుడి చిత్రం ఘన విజయం సాధించటంపై కమల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.


Click it and Unblock the Notifications











