Tunisha Sharma: షాకింగ్ ట్విస్ట్.. సీరియల్ నటి మరణంలో 'లవ్ జీహాద్' కోణం.. మాజీ ప్రియుడు అమాయకుడంటూ!
హిందీ సీరియల్ నటి తునీషా శర్మ మరణం బాలీవుడ్ చిత్ర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. తునీషా శర్మ మరణం చుట్టూ అనేక అనుమానాలతోపాటు రాజకీయ దుమారం రేగుతోంది. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని వాసైలో జరుగుతున్న టీవీ షో షూటింగులో తునీషా తన కోస్టార్ షీజాన్ మహ్మద్ ఖాన్ మేకప్ రూంలో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. తునీషా శర్మ మరణం తర్వాత మహారాష్ట్ర పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తునీషా శర్మ మరణానికి తాజాగా రాజకీయ రంగు పులుముకుంది. ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

దబాంగ్ 3 చిత్రంలో..
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన తునీషా శర్మ భారత్ కీ వీర్ పుత్ర మహారాణ ప్రతాప్ టెలివిజన్ సీరియల్లో చాంద్ కన్వర్ పాత్రలో నటించింది. ఆ తర్వాత టెలివిజన్ షో, సినిమాల్లో నటించి గుర్తింపు పొందింది తునీషా. బాలీవుడ్ బ్యూటీ కత్రీనా కైఫ్ నటించిన ఫితూర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించగా.. బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 చిత్రాలలో అలరించింది తునీషా శర్మ.

షూటింగ్ సమయంలో..
తునీషా శర్మ ఇష్క్ సుభాన్ అల్లా, గబ్బర్ పూంచ్ వాలా, షేర్ ఏ పంజాబీ: మహారాజా రంజీత్ సింగ్, చక్రవర్తి అశోక సమ్రాట్ సీరియల్స్ నటించి మెప్పించింది. మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని వాసైలో జరుగుతున్న ఓ టీవీ షో షూటింగులో పాల్గొంది తునీషా శర్మ. షూటింగ్లో సమయంలోనే బ్రేక్ టైమ్ లో భాగంగా తునీషా శర్మ కోస్టార్ మేకప్ రూమ్లోని వాష్రూమ్కు వెళ్లింది. ఆ రూమ్లోనే ఉరివేసుకొని మరణించింది.

తునీషా శర్మ తల్లి ఫిర్యాదు మేరకు..
అయితే వాష్ రూమ్ గది తలుపులు వేసుకోవడంతో వాటిని పగలకొట్టడానికి చాలా సమయం పట్టింది. తలుపులు పగలకొట్టి తునీషా శర్మను బయటకు తీసే సరికి రాత్రి 1.30 గంటలు అయింది. బయటకు తీసిన తునీషా శర్మను ఆసుపత్రి తరలించే సరికే మరణించిందని వైద్యులు ధ్రువీకరించారు. తునీషా శర్మ తల్లి ఇచ్చి ఫిర్యాదు మేరకు కేను నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.

మానసిక ఒత్తిడి తట్టుకోలేక..
దర్యాప్తులో భాగంగా తునీషా శర్మ, 'అలీ బాబా: దస్తాన్ ఇ కాబుల్' టీవీ షో కోస్టార్ షీజన్ మహ్మద్ ఖాన్ ఇద్దరు కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు తెలిసింది. వారిద్దరూ రిలేషన్షిప్లో ఉంటూ కొద్దికాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే 15 రోజుల క్రితమే వారిద్దరి మధ్య బ్రేకప్ జరిగిందని.. ఆ తర్వాత తునీషా శర్మ మానసిక ఒత్తిడికి గురైంది. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. దీంతో షీజాన్ మహ్మద్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

లవ్ జీహాద్ కోణం ఉందా..
ఇదిలా ఉంటే తాజాగా తునీషా శర్మ మరణంపై భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్ సంచలన కామెంట్స్ చేశారు. ఆమె మరణంలో లవ్ జీహాద్ కోణం ఉండవచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. "గిల్టీని అంగీకరించలేం. తునీషా శర్మ కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరగాల్సిందే. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు ఏంటీ..? ఇందులో లవ్ జీహాద్ ఉందా..? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా..? అన్న నిజాలు విచారణలో బయటపడతాయి. తునీషా శర్మ కుటుంబానికి 100 శాతం కచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఆమె మరణంలో లవ్ జీహాద్ కోణం ఉంటే దాని వెనుక ఉన్న దోషులను విడిచిపెట్టేది లేదు" అని తెలిపారు.

అవన్ని నిరాధారమైనవి..
ఇదిలా ఉంటే షీజన్ మహ్మద్ ఖాన్ ను నాలుగు రోజులు కస్టడీలో ఉంచాలని ముంబై వాసై కోర్టు ఇవాళ మధ్యాహ్నాం ఆదేశించింది. కోర్టు వద్ద షీజన్ మహ్మద్ ఖాన్ తరఫు లాయర్ శరద్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. "ఏం జరిగినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. మహ్మద్ ఖాన్ ను కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయి" అని పేర్కొన్నారు. అలాగే తునీషా శర్మ మరో కోస్టార్ పార్థి జుస్తిని కూడా పోలీసులు విచారించారు.


Click it and Unblock the Notifications











