Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
నిర్బయ రేపిస్ట్ ఇంటర్వూ ...ప్రసార సమయం మారింది
లండన్: ముఖేశ్ ముఖాముఖితో కూడిన వివాదాస్పద 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బుధవారం రాత్రి పదిగంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం వేకువజామున మూడున్నర గంటలు) ప్రసారం చేస్తున్నామని బీబీసీ ప్రకటించింది. 'బీబీసీ ఫోర్'లో బ్రిటన్ వ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ ప్రసారం కానుందని పేర్కొంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
'ఇండియాస్ డాటర్'ను వాస్తవానికి అంతర్జాతీయ మహిళాదినం సందర్భంగా ఈనెల 8న ప్రసారం చేయాలని నిర్ణయించుకున్న బీబీసీ.. భారత్లో ఈ అంశం కేంద్రంగా నెలకొన్న తీవ్రపరిణామాల దృష్ట్యా ప్రసారతేదీని ముందుకు జరిపింది. దీనివల్ల తమ వీక్షకులకు శక్తిమంతమైన ఈ డాక్యుమెంటరీని వీలైనంత త్వరగా చూడటానికి అవకాశం లభిస్తుందని పేర్కొంది.
''బాధితురాలి (నిర్భయ) తల్లిదండ్రుల పూర్తి సహకారంతో ఈ భయానక డాక్యుమెంటరీ తయారైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన దారుణమైన నేరం మూలాలను ఇది వెల్లడిస్తుంది'' అని బీబీసీ తన ప్రకటనలో తెలిపింది.
ఇక ..నిర్భయ అత్యాచారం కేసు నేరస్థుడు ముఖేశ్సింగ్ ముఖాముఖిని (ఇంటర్వ్యూను) ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీల్లో ప్రసారం కానివ్వబోమని కేంద్రహోంమంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు విదేశాంగశాఖను, సమాచార ప్రసారశాఖను, ఐటీశాఖను హోంశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ముఖేశ్ ముఖాముఖితో కూడిన 'ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీని బీబీసీ ఈ నెల 8న ప్రసారం చేయనుందన్న సమాచారం నేపథ్యంలో.. ఆ వార్తాసంస్థతోనూ హోంశాఖ సంప్రదింపులు జరిపింది.
మరోవైపు, ఈ వివాదాస్పద డాక్యుమెంటరీని ప్రసారం చేయవద్దంటూ దిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సంజయ్ ఖనగ్వాల్ టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ముఖేశ్ ముఖాముఖిని ప్రచురించటం, ప్రసారం చేయటం, టెలీకాస్ట్ చేయటం, ఇంటర్నెట్లోకి అప్లోడ్ చేయటం నిషిద్ధమని న్యాయమూర్తి పేర్కొన్నారు. దిల్లీ పోలీసుల విజ్ఞప్తి మేరకు న్యాయమూర్తి ఈ ఆదేశాలను వెలువరించారు.
'ఇండియాస్ డాటర్' వివాదం బుధవారం పార్లమెంటులో ప్రకంపనలను సృష్టించింది. అత్యంత పైశాచిక అత్యాచార ఘటనలో నేరస్థుడిగా ఉన్న ముఖేశ్తో ముఖాముఖికి అధికారులు ఎలా అనుమతించారంటూ వివిధ పార్టీల ఎంపీలు మండిపడ్డారు. ముఖేశ్ వ్యక్తం చేసిన అభిప్రాయాల పట్ల ఉభయసభల్లో మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
నిర్భయ అత్యాచారకాండ వంటి ఘోర ఉదంతాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలను అడ్డుకోవాలని, సదరు డాక్యుమెంటరీ ప్రసారం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. సమాజ్వాదీపార్టీకి చెందిన జయాబచన్ నేతృత్వంలో ప్రతిపక్షాల మహిళా ఎంపీలు రాజ్యసభలో వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ముఖేశ్ ముఖాముఖికి అనుమతించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సభలోంచి వాకౌట్ చేశారు.
అయితే, నామినేటెడ్ ఎంపీలు అనూఆగా, బాలీవుడ్ పాటల రచయిత జావెద్ అక్తర్ మాత్రం ఇతర సభ్యులకు భిన్నంగా స్పందించారు. ''భారత్లో అనేకమంది పురుషుల ఆలోచనాధోరణే ముఖేశ్ వ్యాఖ్యల్లో వెల్లడైంది. ఈ వాస్తవం నుంచి మనం ఎందుకు దూరం జరగాలి? ఎందుకు సిగ్గుపడాలి? నిజానికి ఈ సమస్యను మనం ఎదుర్కోవాలి. అంతా బాగుందనే భ్రమల్లో మనం ఉండొద్దు'' అని ఆగా చెప్పారు.
జావెద్ అక్తర్ మాట్లాడుతూ.. ''ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ తయారుకావటం ఒక మంచి పరిణామం. ఈ దేశంలోని కోట్లాదిమంది మగవాళ్లు తాము ఒక రేపిస్టులాగే ఆలోచిస్తామని ఈ డాక్యుమెంటరీద్వారా తెలుసుకున్నారు. ఇది అసభ్యంగా అనిపిస్తే.. వాళ్లు ఓసారి ఆలోచించుకోవాలి'' అని సూచించారు. నిర్భయ తన స్నేహితుడితో కలిసి రాత్రి తొమ్మిదిగంటలకు బయటకురావటమే తప్పన్నట్లుగా ముఖేశ్ మాట్లాడిన నేపథ్యంలో.. వీరిద్దరూ ఈ విధంగా వ్యాఖ్యానించారు.
ఎంపీల నిరసన నేపథ్యంలో హోంమంత్రి రాజ్నాథ్సింగ్ ఉభయసభల్లో ఒక ప్రకటన చేశారు. ముఖేశ్ ముఖాముఖి గురించి తెలుసుకొని తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జైళ్లలో ముఖాముఖిలకు సంబంధించిన నిబంధనలను సమీక్షిస్తామన్నారు. ఇండియాస్ డాటర్ డాక్యుమెంటరీ ఎటిపరిస్థితుల్లో ప్రసారం కాకుండా చూస్తామని.. ఇప్పటికే అవసరమైన చర్యలను తీసుకున్నామని చెప్పారు.
నిర్భయ మీద జరిగిన అత్యాచారం యావత్దేశానికే సిగ్గుచేటైన విషయమన్నారు. ఇటువంటి దురదృష్టకరఘటనను వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోవటానికి ఎవరు ప్రయత్నించినా వూరుకోబోమని హెచ్చరించారు. ముఖేశ్ ఇంటర్వ్యూకు 2013 జులైలో (యూపీఏ హయాంలో) అధికారులు అనుమతి ఇచ్చినప్పుడు కూడా పలు షరతులను విధించారని.. కానీ, వాటిని లెస్లీఉడ్విన్ ఉల్లంఘించారని రాజ్నాథ్ వెల్లడించారు.
సదరు ముఖాముఖి వీడియోను పూర్తిగా జైలు అధికారులకు చూపించాలని, ఆ ముఖాముఖిని మీడియాకు విడుదల చేయటానికి ముందు అనుమతి తీసుకోవాలని షరతులు ఉన్నాయని తెలిపారు. వీటిని ఉల్లంఘించినందుకుగాను ఉడ్విన్కు తీహార్ జైలు అధికారులు గత ఏడాది ఏప్రిల్లో లీగల్ నోటీసులు కూడా జారీ చేశారని పేర్కొన్నారు.
యూపీఏ హయాంలో హోంమంత్రిగా పని చేసిన సుశీల్కుమార్షిండే మాట్లాడుతూ.. సదరు డాక్యుమెంటరీకి తాను అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇండియాస్ డాటర్ దర్శకురాలు లెస్లీ ఉడ్విన్పై న్యాయపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు హోంశాఖ అధికారులు వెల్లడించారు. ముఖాముఖి కోసం ఇచ్చిన అనుమతిని ఆమె దుర్వినియోగం చేశారని, నిబంధనలను ఉల్లంఘించారని వారు పేర్కొన్నారు. డాక్యుమెంటరీని ఆమె బీబీసీకి విక్రయించటంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ ముఖాముఖిని ఉపయోగించటానికి అనుమతించలేదని చెప్పారు.
మరోవైపు, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై రాజ్నాథ్సింగ్.. దిల్లీ గవర్నర్ నజీబ్జంగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, దిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సిలతో సమావేశం నిర్వహించారు. రాజ్నాథ్ ఆదేశాల మేరకు తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ అలోక్కుమార్వర్మ.. ముఖేశ్ ముఖాముఖి అంశంపై ఒక నివేదికను హోంశాఖకు సమర్పించారు.