నాగబాబు, రోజా, రష్మి, అనసూయలపై ‘జబర్దస్త్’ కేసు ఏమైందంటే?
ఈ కేసును విచారించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థన మేరకు న్యాయవాది దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేశారు.
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రంగంలో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కామెడీ పేరుతో చేస్తున్న కొన్ని స్కిట్లు కొన్ని సార్లు కొందరి మనోభావాలు దెబ్బతీస్తున్నాయనే ఆరోపణ కూడా ఉంది.
ఈ క్రమంలో 2014 జులై 10న ప్రసారం అయిన స్కిట్లో న్యాయవ్యవస్థను అపహాస్యం చేసే విధంగా స్కిట్ చేసారని ఓ న్యాయవాది కరీనంగర్ జిల్లా హుజురాబాద్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ షో నిర్వాహకులతో పాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా, యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మి, స్కిట్ చేసిన వారిపై కేసు నమోదు చేసారు.

హైకోర్టును ఆశ్రయించిన నాగబాబు అండ్ కో
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఫస్ట్ క్లాస్ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని కోరుతూ సినీ నటులు నాగబాబు, రోజా, యాంకర్లు రష్మీ, అనుసూయ, ఇతర కళాకారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కించపరిచే విధంగా షోలు ఉండరాదు
ఈ పిటిషన్ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి విచారించారు. కోర్టులు, న్యాయవాదులను కించపరిచేవిధంగా టీవీ షోలు ఉండరాదని, ఈ ప్రదర్శనల వల్ల న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా టీవీ చానళ్లు కొన్ని మార్గదర్శకాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేత
ఈ కేసును విచారించిన హైకోర్టు పిటిషనర్ల అభ్యర్థన మేరకు న్యాయవాది దాఖలు చేసిన క్రిమినల్ ప్రొసీడింగ్స్ను కొట్టివేశారు. అనిర్దిష్ట బృందాన్ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావని కోర్టు తెలిపింది.

అలా చేస్తే నమ్మకం పోతుంది
టీవీ షోలో న్యాయమూర్తులు, న్యాయవాదులను కించపరిస్తే ప్రజలు, కోర్టులకు వచ్చే వారి దృష్టిలో నమ్మకం సడలుతుందని, కోర్టుల గౌరవం, హుందాతనం దెబ్బతింటుందని, న్యాయవాదుల పరువుకు భంగం కలుగుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోర్టు పేర్కొంది.


Click it and Unblock the Notifications











