‘బిగ్బాస్ 12’ రియాల్టీ షోకు వార్నింగ్: ఆమెను తీసుకుంటే షో మూయించేస్తాం!
ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఓ వైపు ఈ వివాదం రోజు రోజుకు ముదిరి మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటే.... సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ 'బిగ్ బాస్ 12' రియాల్టీ షోలో తనుశ్రీ దత్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తనకు రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అనే రాజకీయ పార్టీ నుండి బెదిరింపులు వస్తున్నాయని, తనను బిగ్ బాస్ 12 షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అనుమతి ఇస్తే బిగ్ బాస్ 12 షోను మూసివేయిస్తామని బెదిరిస్తున్నారని తనుశ్రీ దత్తా ఆరోపించారు.

ఎంఎన్ఎస్ పార్టీ హెచ్చరిక
ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఒక లేఖ విడుదల చేశారు. పబ్లిసిటీ కోసం తనుశ్రీ దత్త తమ పార్టీ అధినేత రాజ్ థాకరే మీద తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండి పడ్డారు. తమ పార్టీ అధ్యక్షుడి మీద, మరాఠీ నటుల మీద, మరాఠీ ప్రజల మీద ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేసినా పార్టీ సహించదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

బిగ్ బాస్ 12 షోకు వార్నింగ్
ఒక వేళ తనుశ్రీ దత్తా బిగ్ బాస్ 12 షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే.... ఆ షోకు వ్యతిరేకంగా భారీ ఆందోళన తప్పదని, అపుడు బిగ్ బాస్ 12 షోను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలు హెచ్చరించారు.

భద్రత కావాలంటున్న తనుశ్రీ
ఈ పరిణామాల నేపథ్యంలో తనుశ్రీ దత్తాకు 24 గంటల భద్రత కల్పించాలని, ఆమె ఇంటి వద్ద సాయుధులైన పోలీసులను నియమించాలని ఆమె ప్రతినిధులు పోలీసులను కోరారు. దీనిపై మహారాష్ట్ర హోం మంత్రి దీపక్ వసంత్ కేసర్కర్ స్పందిస్తూ.... సాయుధులైన పోలీసులతో భద్రత కల్పించాలంటే ప్రత్యేకమైన కారణాలు ఉంటాయని, కేవలం ఆరోపణల పర్వాన్ని బేస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోలేమని, భద్రత కల్పించాల్సిన అవసరం వస్తే తప్పకుండా కల్పిస్తామన్నారు.

రోజు రోజుకు ముదురుతున్న వివాదం
2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగులో నానా పాటేకర్ తనతో మిస్ బిహేవ్ చేశాడని, లైంగికంగా వేధించాడని... ఆతడి షూటింగ్ నుండి వాకౌట్ చేసి వస్తుండగా తనపై ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్తలతో తన కారుపై దాడి చేయించారని.... తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. దాడికి సంబంధించిన అప్పటి వీడియో కూడా విడుదలైంది. తమ పార్టీపై ఆమె ఆరోపణలు చేయడంతో మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

లీగల్ వార్కు సై
తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమెకు నోటీసులు పంపినట్లు నానా పాటేకర్ లాయర్ వెల్లడించారు. అయితే తనుశ్రీ దత్తా మాత్రం తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. ఒక వేళ నోటీసులు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధమే అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











